మల్లికార్జున ఖర్గే
ఖర్గే విమర్శలపై బెంగళూరు స్వతంత్ర పార్కులో బీజేపీ నిరసన
సాక్షి, బెంగళూరు: రాజకీయాల్లో విమర్శలు సహజమే. హద్దు దాటితే రభస జరుగుతుంది. కన్నడ రాజకీయ కురువృద్ధుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి కాలంలో చేస్తున్న ఆరోపణలు బీజేపీలో ఆగ్రహావేశాలను పుట్టించాయి. ఏప్రిల్ 5న కేరళ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఓ రాష్ట్ర ప్రజలు నిరక్ష్యరాసులు అని ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రజలు విద్యావంతులని, వారిని దారి తప్పించడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. చివరికి తేరుకుని ఎక్స్ ద్వారా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఏప్రిల్ 7న అస్సాం బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్, బీజేపీలను పాముతో పోల్చుతూ తీవ్రంగా విమర్శించారు. ఓ వర్గం ఓటర్ల మెప్పు కోసమే ఖర్గే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఖర్గే మత విద్వేషాలు రేపుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖర్గే మాటలను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల నిరసనలు తెలిపారు. బెంగళూరు ఫ్రీడంపార్క్ వద్ద ఆందోళన చేశారు. ఖర్గేకు మద్దతుగా సీఎం, డీసీఎంలు ఇంకా స్పందించలేదు.
ఖర్గే హద్దుల్లో ఉండాలి: బీజేపీ
బనశంకరి: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుక హద్దుల్లో పెట్టుకుని మాట్లాడాలని, ఆయనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదేమోనని బీజేపీ నాయకులు విమర్శించారు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఖర్గే బీజేపీ , ఆర్ఎస్ఎస్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయనపై విద్వేష నియంత్రణ చట్టం కింద కేసు పెట్టాలన్నారు. రజాకార్లు ఆయన కుటుంబం మీద దాడి చేశారని ఖర్గే చెప్పారు, వారి గురించి మాట్లాడటం మానేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ను దూషించడం తగదన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద వివాదాస్పద విమర్శలతో సెగలు


