కోలారు: రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు బుధవారం నగరంలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. కరవే జిల్లా అధ్యక్షుడు మేడిహాళ రాఘవేంద్ర మాట్లాడుతూ గవర్నర్ గెహ్లాట్ హిందీ సామ్రాజ్యవాదుల పరంగా మాట్లాడి కర్ణాటక వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. అందువల్ల కేంద్రం గవర్నర్ గెహ్లాట్ను వెనక్కు పిలిపించుకోవాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షలో తృతీయ భాష హిందీకి గ్రేడింగ్ వ్యవస్థ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని గవర్నర్ సూచించడం ఆయన కన్నడ వ్యతిరేక ధోరణిని సూచిస్తోందన్నారు. గవర్నర్ చర్య రాష్ట్రంలో కన్నడిగులపై శాశ్వతంగా హిందీని రుద్దేవిధంగా ఉందని అన్నారు. కన్నడ వ్యతిరేకి గవర్నర్ తమకు వద్దని, ఆయనను కేంద్రం వెనక్కు పిలిపించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ప్రధాన కార్యదర్శి వీ.మునిరాజు, మహిళా అధ్యక్షురాలు లతాబాయి మాడిక్, తాలూకా అధ్యక్షుడు శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.


