సాక్షి,బళ్లారి : దావణగెరె దక్షిణ, బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని పంపించారు. ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలకు టెన్షన్ నెలకొంది. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శామనూరు సమర్థ బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస దాసకరియప్ప బరిలో ఉండి గత 15 రోజుల నుంచి ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. ఇక బాగలకోటె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేష్ మేటి, బీజేపీ అభ్యర్థిగా వీరన్న చరంతిమఠ్ బరిలో ఉండి హోరాహోరిగా ప్రచారం చేశారు. ఇక ఓటరు దేవుళ్లు తీర్పు నేడు ఈవీఎంలలోకి నిక్షిప్తం కానున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అభ్యర్థులకు ఓటరు దేవుళ్ల తీర్పు ఎటు వైపు ఉంటుందోనని ఉత్కంఠత నెలకొంది. ఎన్నికల సిబ్బంది రెండు నియోజక వర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేస్తున్నారు.
ఉదయం 7 నుంచి
సాయంత్రం 6 వరకు పోలింగ్
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిపేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,50,797 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,26,999 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,32,775 మంది కాగా ఇతర ఓటర్లు 23 మంది ఉన్నారు. మొత్తం 332 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1564 మంది ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించారు. వీటిలో సూక్ష్మ, అతిసూక్ష్మ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. కాగా బాగలకోటె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 10 మంది ఏఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 250 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 284 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1500 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మొత్తం 2,31,072 మంది ఓటర్లు ఉండగా, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన
ఎన్నికల సిబ్బంది
రెండు నియోజకవర్గాల్లో
గట్టి పోలీస్ బందోబస్తు
దావణగెరె నియోజకవర్గంలో
మొత్తం ఓటర్లు 2,31,072 మంది
బాగలకోటె అసెంబ్లీలో మొత్తం 2,50,797 మంది ఓటర్లు


