శివాజీనగర: ముఖ్యమంత్రి పదవిలో సిద్దరామయ్యే కొనసాగుతారు అని ఆయన సన్నిహిత మంత్రులు పరమేశ్వర్, మహ్మద్ జమీర్ ఖాన్ మరోసారి ప్రకటించడం అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది. పదే పదే సిద్దరామయ్యకు మద్దతుగా, డీసీఎం డీకే శివకుమార్ను చిన్నబుచ్చేలా కొందరు మంత్రులు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అయితే గృహ నిర్మాణ మంత్రి జమీర్ మరో అడుగు ముందుకేసి 2028 అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా 3వ సారి సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతో డీకే వర్గంలో ఆగ్రహాన్ని నింపింది. మంత్రి జమీర్ తనకు అప్పగించిన బాధ్యతలు కాకుండా మిగతా విషయాలలో తలదూరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పదే పదే సీఎం సీటు వివాదాన్ని లేవనెత్తడం ద్వారా హైకమాండ్కు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఉప ఎన్నికలు ముగియగానే
2 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు ముగిసిన తరువాత ఢిల్లీకి వెళ్తారని తెలిసింది. వ్యతిరేకులను కట్టడి చేయాలని ఫిర్యాదు చేయడంతో పాటు డీకే శివకుమార్ కు వెంటనే అధికారం కట్టబెట్టాలని కోరతారని తెలిసింది. మంతి జమీర్ పదే పదే సిద్దరామయ్య తరపున ఏదో ఒకటి మాట్లాడటం డీకే వర్గానికి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో జమీర్ ఉద్వాసన లక్ష్యంగా పెట్టుకొని ఢిల్లీ యాత్ర చేయాలని డీకే సన్నిహితులు నిశ్చయించారు.
సీఎం సిద్దుకు మద్దతుగా
కొందరు మంత్రుల వ్యాఖ్యలు
3వ దఫా సిద్దునే సీఎం అన్న
మంత్రి జమీర్ ఖాన్
హైకమాండ్కు ఫిర్యాదుకు డీసీఎం
డీకే వర్గం నిర్ణయం


