శివాజీనగర: విమానాశ్రయంలో తనకు అధికారం లేకపోయినా విదేశీ యువతిని బలవంతంగా టాయ్లెట్లోకి తీసుకెళ్లి తనిఖీలంటూ అసభ్యంగా ప్రవర్తించిన బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు ఉద్యోగి మీద హైకోర్టు కొరడా ఝుళిపించింది. ఆ కేసును రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. బెంగళూరు ఉత్తర తాలూకా రామయ్య లేఔట్కు చెందిన మహమ్మద్ ఆఫాన్ అహమ్మద్ ఈ కేసులో నిందితుడు కాగా, కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటనలో పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనిని రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు.
ఏం చేసినా సహించాలా?
విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. అతని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతనిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని తెలిసి మండిపడ్డారు. దక్షిణ కొరియా మహిళను పురుషుల మరుగుదొడ్డికి తీసుకొని వెళ్లి అసభ్యంగా తాకావు, మరో దేశం మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని సహించాలా?, నీవు ఏమేం చేశావో బాధితురాలు వివరించింది. పురుషుల టాయ్లెట్కు మహిళను ఎందుకు తీసుకెళ్లావు, దానికి సమాధానం చెప్పు అని న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు.
రోడ్ రేజ్ను మన్నించేది లేదు
టెక్కీ పిటిషన్పై హైకోర్టు
శివాజీనగర: నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసినందుకు ఎలాంటి క్షమాపణ ఉండదని హైకోర్టు తెలిపింది. కావాలనే బైకిస్టును ఢీకొని ప్రమాదానికి పాల్పడిన కేసులో టెక్కీకి ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. తనపై దాఖలైన హత్యాయత్నం కేసును రద్దు చేయాలని కోరుతూ బెంగళూరులోని కొడిగెహళ్ళికి చెందిన సుకృత్ కేశవ్గౌడ అనే టెక్కీ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సహనాన్ని నేర్పుతుంది, అది మీకు ఉండాలని జడ్జి పేర్కొన్నారు. ఆయన ఆఫీసుకు వెళ్తున్నారు, ప్రమాదం చేయాలని ఎలాంటి ఉద్దేశం లేదు, ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం అని తప్పుగా నమోదు చేశారు, కాబట్టి కేసును రద్దు చేయాలని పిటిషన్దారు వకీలు విన్నవించారు. అయితే రోడ్ రేజ్కు క్షమాపణ లేదని జడ్జి స్పష్టంచేసి పిటిషన్ను తిరస్కరించారు.
ఎయిర్పోర్టు ఉద్యోగిపై హైకోర్టు ఆగ్రహం


