యశవంతపుర: బిల్డర్ భార్యను పరిచయం చేసుకొని, ఆమె నుంచి 1.8 కేజీల బంగారు నగలను స్వాహా చేసిన వ్యక్తి ఉదంతమిది. సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియనివారితో చాటింగ్ చేస్తూ అన్ని విధాలా మోసపోతున్నవారికి నిలువెత్తు నిదర్శనంగా ఆమె మారింది. వివరాలు.. బెంగళూరు వైట్ సిటీ లేఔట్ శీగెహళ్లిలో ఓ బిల్డర్ నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఏపీలోని చెన్నూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు. బీటెక్ చదివిన నిందితుడు పెళ్లయి భార్యను వదిలేశాడు. బెట్టింగ్ అలవాటు ఉన్న మహేశ్.. మాయమాటలు చెప్పి ఆమెను డబ్బులు అడిగాడు. నా వద్ద డబ్బులు లేవు. బంగారం ఉందని చెప్పి అతడి చేతికిచ్చింది. మహేశ్ తరచూ బెంగళూరుకు వచ్చి ఆమె నుంచి బంగారు నగలు తీసుకెళ్లేవాడు, అలా 1.8 కేజీల బంగారాన్ని ఆమె సమర్పించుకుంది.
భర్త అడగడంతో..
మోసగాడు ఆ బంగారాన్ని అమ్మి బెట్టింగ్ ఆడి జల్సాలు చేశాడు. ఇంట్లో బంగారు లేదని భర్త గమనించి భార్యను అడిగాడు. దీంతో ఆమె నగలను తిరిగి ఇవ్వాలని మహేశ్ను కోరింది. అయితే అతడు బంగారం ఇచ్చేది లేదు, గట్టిగా అడిగితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. బాధిత మహిళ కేఆర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలించి మహేశ్తో పాటు మరో నిందితున్ని అరెస్ట్ చేశారు. 571 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో పరిచయమై
సర్వం దోపిడీ
బెంగళూరులో సంఘటన


