రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైన ఆ నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని జేసీటీయూ డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన బ్లాక్డేలో సంఘం అధ్యక్షులు శరణ బసవ మాట్లాడారు. ఆ చట్టాల రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోకారమ్మ, వీరేష్, వరలక్ష్మి, జమున, కరియప్ప, మహాదేవి తదితరులు పాల్గొన్నారు.
వికృత కామాంధుని అరెస్ట్
● మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వైనం
సాక్షి,బళ్లారి: కొప్పళ జిల్లా గంగావతి పట్టణంలో గత కొన్ని రోజులుగా పలు కాలనీల్లో మహిళల లోదుస్తులు చోరీ అయ్యాయి. దీంతో ఆయా కాలనీల మహిళలు భయాందోళన చెందారు. ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఆరవేసిన లోదుస్తులను తీసుకెళ్లి పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తి ఎవరన్న ఉత్కంఠత వీడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఇళ్ల ఆవరణలోకి చొరబడి మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు.
ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
హొసపేటె: తాలూకాలోని కమలాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపుర గ్రామంలో బుధవారం ఎలుగుబంటి దాడిలో రాయప్ప(50) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఉదయం 6 గంటల సమయంలో రాయప్ప తన తోటలో నుంచి ఇంటికి వస్తుండగా ఎలుగుబంటి అతడిపై దాడి చేసింది. అతని కళ్లు, చెవి వద్ద తీవ్ర గాయాలు కావడంతో భారీగా రక్తస్రావం జరిగింది. తీవ్రంగా గాయపడిన రాయప్పను గ్రామస్తులు నగరంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బళ్లారి ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
4న పాఠశాల ప్రారంభం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో ఈనెల 4న కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శ్రీకృష్ణ దేవరాయ సైనిక పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు శ్రీకృష్ణ దేవరాయ సైనిక పాఠశాల అధ్యక్షుడు వెంకటరావు పేర్కొన్నారు. ఈ పాఠశాల ద్వారా కళ్యాణ కర్ణాటక ప్రాంత విద్యార్థులకు, యువతకు మంచి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
యశ్వంత్ కుమార్కు సన్మానం
సాక్షి,బళ్లారి: ఇటీవల యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 409వ ర్యాంకు సాధించిన యశ్వంత్కుమార్ బళ్లారి జిల్లాకు కీర్తి తెచ్చారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని విశాల్నగర్లో యశ్వంత్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన్ను ఘనంగా సన్మానించారు. యూపీఎస్సీ పరీక్ష ఎంతో కఠినమైందని, కష్టపడి, ఇష్టపడి చదవడంతోనే ర్యాంకు సాధించగలిగారని కొనియాడారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. యశ్వంత్ తల్లిదండ్రులు శ్రీనివాస్, అరుణ, సోదరుడు తదితరులు పాల్గొన్నారు.
కంటి పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుధవారం కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూల విరాట్టుకు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా శిబిరంలో వందలాది మంది భక్తులకు వైద్యులు ఉచిత నేత్ర పరీక్షలు జరిపారు.


