‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేదు
రాయచూరు రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పార్టీకి పొత్తు లేదని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, సిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. బీఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసి విడిచి పెట్టిన వారి పేర్లను నమోదు చేయడానికి అందరూ ముందుండాలని అన్నారు. ఈ నెల 11 నుంచి దేవదుర్గలో సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ, జేడీఎస్ పార్టీల మైత్రి కొనసాగుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో శివశంకర్, నరసింహ నాయక్, రామకృష్ణ, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నాగరాజ్లున్నారు.
వెనెజువెలాపై దాడి తగదు
హొసపేటె: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై శనివారం అమెరికా సైనిక దళాలు నిర్వహించిన వైమానిక దాడిని ఖండిస్తూ నగరంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోర్డు సభ్యుడు బసవరాజ్ మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ అపహరణను సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భారత్ సీపీఎంతో సహా వామపక్షాలు వెనెజువెలా దేశ ప్రజలకు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. నిరసనలో సీపీఎం కార్యదర్శి ఎన్.యల్లాలింగ, రాష్ట్ర కమిటీ నాయకురాలు బి.మాళమ్మ, ఎం.గోపాల్, ఎం.జంబయ్య నాయక్, వి.స్వామి, బీ.మహేష్, కే.నాగరత్నమ్మ, సిద్దలింగప్ప, సుంకమ్మ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
వెనెజువెలాపై దాడికి నిరసన
రాయచూరు రూరల్: అమెరికా సైన్యం వెనెజువెలా వంటి చిన్న దేశంపై దాడి చేయడం తగదని సీపీఐ(ఎంఎల్) పేర్కొంది. మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్న దేశమైన వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, భార్యను కిడ్నాప్ చేయడం సరి కాదన్నారు. ఈ ఘటనను ఇతర యూరప్ దేశాలు ఖండించక పోవడంతో పాటు దానికి మద్దతు పలకడం అమానుషమన్నారు. కిడ్నాప్కు గురైన వారి విడుదలకు భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ముందుకు రావాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దహనం చేశారు.
నీలగల్ జాతరకు శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా నీలగల్లో ఈ నెల 10 నుంచి జరగనున్న జాతర ఉత్సవాలకు నాల్వార కోరి సిద్దేశ్వర పీఠాధిపతి తోటేంద్ర స్వామీజీ శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి మఠంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం హేమరెడ్డి మల్లమ్మ పురాణం గురించి వివరించారు. కేవలం సహనంతో ఆదర్శ గృహిణిగా జీవితాన్ని సాగించిన సాధ్వి అని అన్నారు. శివభక్తితో పాటు సంసారిక జంజాటంలో ఉన్న ఒడిదుడుకులను సైతం ఎదిరించిన మహా సాధ్విగా కొనియాడారు. మానవుడు సమాజంలో సత్పురుషునిగా మారాలని సూచించారు. పంచాక్షరి, అభినవ రాచోటి రేణుక శాంతమల్ల శివాచార్య, విరుపాక్ష పండితారాధ్య, శంభు సోమనాథ శివాచార్య, విశ్వారాధ్య, మహాంతదేవరులున్నారు.
విద్యుదుత్పత్తి కేంద్రాల పరిశీలన
రాయచూరు రూరల్: ఆర్టీపీఎస్, వైటీపీఎస్ విద్యుత్ స్ధావరాలను తుమకూరు సిద్దగంగ మఠం పీఠాధిపతి సిద్దలింగ స్వామీజీ వీక్షించారు. సోమవారం ఆర్టీపీఎస్, వైటీపీఎస్ అధికారులు స్వామీజీకి యూనిట్ల పని తీరు, బాయిలర్, కూలింగ్ టవర్, ఉత్పత్తి సామర్థ్యం కల ప్లాంట్లను చూపించారు. రాయచూరు నుంచి రాష్ట్రానికి 60 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలను చూశారు. నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఈ ప్రాంత ప్రజలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం విచిత్రమన్నారు. ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో చెట్లు నాటాలని అధికారులకు సూచించారు.
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేదు
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేదు


