
ఢిల్లీలోనూ గుంతల రోడ్లు ఉన్నాయి
శివాజీనగర: సిలికాన్ సిటీలో గుంతల రోడ్ల రభస తీవ్రరూపం దాలుస్తోంది. విమర్శలు జాతీయస్థాయికి ఎగబాకాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో గుంతల రోడ్లను బాగు చేస్తున్నాం, ప్రతిరోజు సుమారు 1000 గుంతలను మూసివేసే పని జీబీఏ అధికారులు చేస్తున్నారు, దీనిని ఐటీ కంపెనీలు తెలుసుకోవాలి అని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా గుంతల రోడ్లు ఉన్నాయి. దేశంలో అన్నిచోట్ల ఉన్న సమస్య ఇది. అలాగని ఊరుకోకుండా పని చేస్తున్నాం. దీనినే పెద్ద విషయంగా చూపి రచ్చ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు రోడ్డులో ఎన్ని గోతులు ఉన్నాయనేది చూడాలన్నారు. ఇది కర్ణాటక రాష్ట్ర సమస్య మాత్రమే కాదు, గతంలో బీజేపీవారు అధికారంలో ఉన్నపుడు సక్రమంగా రోడ్లు వేసి ఉంటే నేడు ఈ సమస్య ఉండేది కాదు. ఎన్నికలు వస్తున్నాయని ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు. సిటీలో ఐదు కార్పొరేషన్లలో ఒక్కొక్క పాలికెలో 200 గుంతల చొప్పున మూసివేస్తున్నాం. నేను ఒక రోజు ఢిల్లీలో తిరిగాను, ప్రధాని ఇంటికి వెళ్లే దారితో పాటుగా అనేక రోడ్లలో గుంతలు ఉన్నాయి, ఈ విషయాన్ని మీడియావారు పరిశీలించి ప్రచురించాలి. దేశవ్యాప్తంగా గుంతలు రోడ్లు ఉంటే, కర్ణాటకనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అని వాపోయారు.
విప్రో క్యాంపస్ నుంచి
వాహనాలకు దారివ్వాలి
శివాజీనగర: బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డులో సంచార రద్దీని తగ్గించడానికి వీలుగా విప్రో కంపెనీ క్యాంపస్ ద్వారా పరిమిత వాహన సంచారానికి అవకాశం ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య విప్రో అధినేత అజీం ప్రేమ్జీకి విన్నవించారు. ఈ మేరకు 19వ తేదీన రాసిన లేఖ మంగళవారం విడుదలైంది. దీని వల్ల 30 శాతం రద్దీ తగ్గుతుందని సమాచారం. క్యాంపస్ ద్వారా వాహన సంచారానికి అనుమతిస్తే అందుకు తగిన పరిహారాన్ని ఆ సంస్థకు చెల్లించనున్నట్లు సమాచారం. నగరంలో ఐటీ సంస్థలకు ప్రధాన కారిడార్ అయిన ఔటర్ రింగ్ రోడ్డులో విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. ఈ ప్రాంతంలో సువిశాలమైన విప్రో ఆఫీసు ఉంది. దీని ద్వారా వెళ్లే ఓ రోడ్డును వాడుకోవాలని సర్కారు యోచిస్తోంది. కొన్నివారాలుగా బెంగళూరు ట్రాఫిక్ సమస్య మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విప్రో మీద సిద్దు దృష్టి సారించారు. ఇందుకు విప్రో నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం.
ప్రధాని ఇంటి వద్ద కూడా గోతులు
అందరూ బెంగళూరునే
హేళన చేస్తున్నారు
డీసీఎం శివకుమార్ ఆగ్రహం