
ఉప్పొంగిన రాయరకెరె ●
● నీటి మునిగిన పంటలు
హొసపేటె: ఉదయం కురిసిన ఏకధాటి వర్షానికి నగర శివారులో ఉన్న రాయరకెరె చెరువు పూర్తిగా నిండటంతో చుట్టుపక్కల ఉన్న చెరుకు, అరటి పంటల్లోకి వర్షం నీరు చేరడంతో పంటలు దెబ్బ తిన్నాయి. నగరంలో గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన అరటి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు పొలాల్లో పనులు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. మరో రెండు మూడు రోజుల వరకు యథావిధిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పిడుగుపాటుకు
యువకుడు మృతి
రాయచూరు రూరల్: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. సురపుర తాలూకా పేట అమ్మాపూర్లో మారెప్ప(21) అనే యువకుడు పొలంలో గొర్రెలు కాస్తుండగా పిడుగు పడడంతో మరణించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. సురపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కలుషిత నీరు తాగి
20 మందికి అస్వస్థత
రాయచూరు రూరల్: కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం భూతలదిన్ని క్యాంప్లో గ్రామ పంచాయతీ అధికారులు కలుషిత నీటిని సరఫరా చేయడంతో వాటిని తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతున్నారు. తాలూకా ఆరోగ్య అధికారి అయ్యనగౌడ గ్రామంలో మకాం వేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి గత ఏడాది నుంచి నీటి ట్యాంక్ను శుభ్రం చేయకుండా యథాప్రకారం నీటిని వదలడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు.
హాస్టల్లో నాసిరకం
ఆహారంపై తనిఖీ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిక్కజోగిహళ్లిలోని పీఎంశ్రీ జవవర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాసిరకం ఆహారం వడ్డిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేసి అక్కడి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ, పాఠశాల నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కార్యక్రమం తర్వాత విద్యార్థుల హాస్టల్ వంటగది, భోజనశాలకు వెళ్లి విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వంటగదిని శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన వెజ్ పలావ్లో ఒక్క కూరగాయ కూడా లేదు. బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయి. చపాతీ పిండి తయారీ యంత్రం కూడా తుప్పు పట్టి ఉంది. గమనించిన ఎమ్మెల్యే చాలా జాగ్రత్తగా పని చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని హాస్టల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్లకు సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
కోలారు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన ఘటన శుక్రవారం రాత్రి ముళబాగిలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ముళబాగిలు తాలూకా చిక్కనదొడ్డి గ్రామానికి చెందిన వేణుగోపాల్(52) వివాహ కార్యక్రమాల్లో పూల అలంకరణ చేసేవాడు. ఈయన ముళబాగిలులో పని ముగించుకొని గ్రామానికి బైక్లో వస్తుండగా కారు ఢీకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముళబాగిలు నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఉప్పొంగిన రాయరకెరె ●

ఉప్పొంగిన రాయరకెరె ●

ఉప్పొంగిన రాయరకెరె ●