
హనుమంతరెడ్డి
గౌరిబిదనూరు: తాలూకా మరళూరు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి సహకార రత్న ప్రశస్తికి ఎంపికయ్యారని మాజీ ఎమ్మెల్యే శివశంకరరెడ్డి తెలిపారు. బిజాపూర్లో సోమవారం జరిగే సహకార సప్తాహం ముగింపు సమావేశాల్లో సీఎం సిద్దరామయ్య, మంత్రి రాజన్న చేతుల మీదుగా హనుమంతరెడ్డికి సహకార రత్న ప్రశస్తిని అందజేయనున్నట్లు తెలిపారు. కోలారు చిక్కబళ్లాపురం జిల్లాల్లో డీసీసీ బ్యాంకు డైరెక్టరుగా చేసిన సేవలు, రైతుల సంక్షేమానికి అందించిన సేవలను గుర్తించి ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు.
సీఎంపై కుమార విమర్శలు
దొడ్డబళ్లాపురం: సీఎస్ఆర్ అంటే కరప్ట్ సన్ ఆఫ్ సిద్ధరామయ్య అంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎక్స్ వేదికగా సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్రపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం సిద్ధరామయ్యకు అధికారం అనే అంటురోగం అంటుకుందని ధ్వజమెత్తారు. ‘మంత్రులను బౌన్సర్లుగా నియమించుకున్నారా? నాపై అందరితో మూకుమ్మడిగా దాడి చేయిస్తే కుమారస్వామి బెదిరిపోతాడనుకున్నారా?అంతసీను లేదు’ అంటూ కుమార ట్విట్ చేశారు. మీ కుమారుడిని ఆశ్రయ కమిటీ అధ్యక్షుడిగా చేసి కేడీపీ సభ జరపడానికి అనుమతి ఇచ్చారా? ఇలా చేయవచ్చని ఏ చట్టంలో ఉంది? అని ప్రశ్నించారు.రాష్ట్ర ముఖ్యమంత్రినే టెలిఫోన్ ఆపరేటర్ చేసిన మీ కుమారుడిని ఇంకా సమర్థిస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చిన్నారి అనుమానాస్పద మృతి
యశవంతపుర: అనుమానస్పద స్థితిలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా గంగోండహళ్లిలో జరిగింది. వినోద్, నళిని దంపతుల కుమార్తె అకృతి(7) తమ ఇంటి పక్కలోనే నివాసం ఉంటున్న నంజుండప్ప, పల్లవి ఇంటికి వెళ్లింది. అనంతరం బాలిక విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించారు. చిన్నారి ఎలా మృతి చెందిందో అర్థం కావటంలేదు. కేసు దర్యాప్తులో ఉంది.
‘కుమారస్వామి
ముందు నుంచి అంతే’
మైసూరు: భూ సుధారణ సవరణ చట్టానికి శాసనసభలో బీజేపీకి మద్దతు ఇచ్చి బయటకు వచ్చి వ్యతిరేకంగా ధర్నా చేసిన వ్యక్తి జేడీఎస్ నేత హెచ్.డి కుమారస్వామి అని, ఆయనకు సైద్ధాంతిక స్పష్టత లేదని మంత్రి హెచ్.సి. మహాదేవప్ప అన్నారు. యతీంద్ర సీఎం సిద్దరామయ్యతో మొబైల్ఫోన్ సంభాషణ గురించి కుమార ఆరోపణలు చేయడం తగదన్నారు. కుమారస్వామికి మొదటి నుంచి ఇలాగే తప్పుడు ఆరోపణలు చేయడం ఆయన సహాజ గుణమని అన్నారు.