కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలు
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు లక్ష ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తి కానున్న తరుణంలో అధికారిక లెక్కలు ఇవే చెబుతున్నాయి. నియోజకవర్గంలో 3,68,832 ఓట్లకు ఇప్పటివరకు 1,01,387 ఓట్లు అన్కలెక్టబుల్ అని అధికారులు చెబుతున్నారు. తుది జాబితా వరకు లెక్కలు కాస్త మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం కరీంనగర్లో సోమవారంతో ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించడం తెలిసిందే. కరీంనగర్ నియోజకవర్గంలోని 390 పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం.. తిరిగి సేకరించడం, వివరాలు ఆన్లైన్లో నమోదు కొనసాగిస్తున్నారు. సోమవారం నాటికి కరీంనగర్లో 71 శాతం పూర్తయినట్లు ఈఆర్వో, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఓట్లకు పైగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 3,68,832 ఓట్లర్లలో 1,01,387 ఓట్ల అన్కలెక్టెబుల్ జాబితాలో ఉన్నాయి. అందులో మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తమ ఓటు తరలించుకున్నవాళ్లు, డబుల్ ఓట్లు ఉన్నవాళ్లు ఉంటారు. దీంతో సహజంగానే జాబితా నుంచి ఈ ఓట్లు తొలగిపోనున్నాయి. ఎక్కువగా 74,964 షిఫ్టెడ్ ఓట్లు ఉండడంతో, తుది జాబితా ప్రకటించే సమయానికి అన్కలెక్టబుల్ జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు కాస్త అటు, ఇటుగా తొలగిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం ఓట్లు 3,68,832
పోలింగ్ బూత్లు 390
డిజిటలైజ్డ్ అయినవి 2,62,466
డిజిటలైజ్డ్ చేయాల్సినవి 4,959
అన్కలెక్టెబుల్ 1,01,387
డెత్ 9,391
ఆబ్సెంట్ 4,506
షిఫ్టెడ్ 74,964
డబుల్ 7,990
ఇతర 4,536


