కరీంనగర్కల్చరల్: ఎండలు మొదలయ్యాయంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కొత్త కుండలు తప్పనిసరి. పేదోడి ఫ్రిజ్గా పేరుగాంచిన మట్టి కుండలు, కూజలు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆధునికకాలంలో ఫ్రిజ్లు వచ్చిన తర్వాత కొంతకాలం కుండల వినియోగం తగ్గినా, ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రజలు మళ్లీ సహజ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఫ్రిజ్లోని చల్లని నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో, అన్ని వర్గాల ప్రజలు కుండనీళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మార్కెట్లో మట్టి కుండలు, కూజలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక కుండలు
రాజస్థాన్, నాగపూర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వ్యాపారులు వివిధ ఆకృతుల్లో కుండలు, కూజలను తెచ్చి విక్రయిస్తున్నారు. చిన్న, పెద్ద సైజుల్లో లభిస్తున్న ఈ కుండల ధరలు రూ.150, 200, 250 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. రాజస్థాన్ నుంచి తెచ్చిన మట్టి వాటర్ బాటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా రూ.180కి విక్రయిస్తున్నారు.
గతంలో కన్నా నేటి మార్కెట్లో వివిధ రకాల ఆకృతుల్లో తయారైన కుండలు, కుజల కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొత్త కుండలకు మంచి గిరాకీ కనిపిస్తోంది. ప్రజల నుంచి స్పందన ఉంది. అమ్మకాలు బాగున్నాయి.
– మహమ్మద్ అబ్దుల్ అలీమ్
కుండలో నీరు ఆరోగ్యానికి మంచిది. ఎండకాలంలో కుండలోని నీరు తాగడం ద్వారా దాహం తీరుతుంది. చిన్నప్పుటి నుంచి కుండ నీటినే తాగుతున్నా. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రావు. ఫ్రిజ్ నీరు కన్నా కుండ నీరే మంచిది.
– కరుణాకర్, కిసాన్నగర్


