చింతకుంట భూ దందాలో సరికొత్త కోణాలు
కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ముఠా సభ్యుల్లో టైలర్, లాయర్, కూలీ, విద్యార్థి, రైతు
విక్రేతలు, కొనుగోలుదారులు, సాక్షులు అన్నీ వీరే
ఇప్పటికీ పరారీలో ఎ–2 మర్రి వెంకటస్వామి
భూమిలోకి వస్తే..
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
వారంతా చూసేందుకు సాధారణ వ్యక్తులు. సమాజంలో వృత్తిపరంగా ఒకరు మహిళా టైలర్, మరొకరు న్యాయవాది, కూలీ, రైతు, యువత విద్యార్థిగా ఉన్నారు. కానీ.. ప్రవృత్తి భూములు కబ్జా చేయడం. కరీంనగర్లో సంచలనం రేపిన చింతకుంట సర్వే నంబరు 212, 214లలో వెలుగుచూసిన భూకబ్జాల పర్వంలో నిందితుల గురించి రిమాండ్లో పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు దాదాపు పదిమందికిపైగా నిందితులుగా చేర్చారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. నలుగురు పరారీలో ఉన్నారు. చూసేందుకు సాధారణంగా కనిపించే వీరు కరీంనగర్ శివారులోని చింతకుంటలో రూ.కోట్లాది విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న తీరును చూసి పోలీసులే విస్తుపోతున్నారు. అసలు వీరు చేస్తున్న వృత్తులకు, వీరు సంపాదించిన రూ.కోట్ల విలువైన భూముల ఆస్తుల విలువకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఈ కేసులో బయటికి రాని వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికితోడు భూ యజమాని షేక్ అహ్మద్ మనుషులను భూమిలోకి అడుగుపెడితే అక్కడే చంపి పాతిపెడతామంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
నిందితుల వృత్తులు
ఎ–1 కిన్నెర మల్లవ్వ (టైలరింగ్), ఎ–3 బామండ్ల రవీందర్ (రైతు), ఎ–5 లోకిని పోచయ్య (కూలీ), ఎ–7 అనుమ బాలయ్య (కూలీ), ఎ–8 లోకిని ఆ దిత్య (విద్యార్థి), ఎ–9 లోకిని రాజవ్వ (బల్దియా కాంట్రాక్ట్ లేబర్) ఈ ఆరుగురిని పోలీసులు రిమాండ్ తరలించారు. ఇక ఎ–2 మర్రి వెంకటస్వామి (లాయర్), ఎ–4 మాడిశెట్టి భాగ్యలక్ష్మి, ఎ–6 మారేడుగొండ తిరుపతి, ఎ–10 బ్యాంకు అధికారులు పరారీలో ఉన్నారు.
మాస్టర్ మైండ్ లాయరేనా?
ఈ భూదందా కేసులో ఏ–2గా ఉన్న మర్రి వెంకట స్వామి వృత్తిరీత్యా లాయరు. మార్చి వరకు ఒక జా తీయ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ ముఠాలో సగానికిపైగా సభ్యులంతా అదే పా ర్టీలో ఆయన అనుచరులుగా వివిధ హోదాలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీ వీరిని ఇటీవల బ హిష్కరించినట్లు సమాచారం. వాస్తవానికి ఎ–1 మ ల్లవ్వను పోలీసులు చూపిస్తున్నారు. ఈ భూ కబ్జాలో డాక్యుమెంట్లలో ఆమె పాత్ర ఆధారంగా పోలీసులు ఎ–1గా చూపించారు. కానీ, ఈ భూదందా వెన క అసలు సూత్రధారి మర్రి వెంకటస్వామి అయి ఉంటాడని టూటౌన్ పోలీసులు అనుమానిస్తున్నా రు. ప్రస్తుతం అతను, మరో నిందితుడు పరారీలో ఉండగా ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించారని సమాచారం. ఈ కేసులో వీరి పాత్ర ఆధారంగా పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందు కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పది మంది వరకు నిందితులు ఉండగా.. నకిలీ పత్రాలతో కబ్జా చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని, వీరిలో వీరికి విక్రయిస్తారు. ఆ సమయంలో ఇదే స భ్యులు సాక్షులుగా వ్యవహరిస్తారు. ఇలా నలుగురైదురికి విక్రయించి లింక్ డాక్యుమెంట్లు సృష్టించి అ మాయకులకు విక్రయించారు. కొన్ని ప్లాట్ల విషయంలో బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


