నిబంధనలకు పాతర.. నిగ్గు తేల్చడంలో విఫలం
నిస్సిగ్గుగా కొనసాగుతున్న గ్రానైట్ అక్రమ దందాలు
అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి●:
కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, బద్ధిపల్లి, ఎలగందుల, శ్రీరాములపల్లి, ఖాజీపూర్, కమాన్పూర్, నాగులమల్యాల, గంగాధర మండలం ఒద్యారంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానై ట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు అనేకం అనుమతుల్లేకుండా నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 నియమ నిబంధనలకు పాతరేస్తూ..అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణం ధ్వంసమై స్థానికులకు తీవ్ర హాని కలుగుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి గ్రానైట్ అక్రమ దందాలను నిగ్గు తేల్చుతామని ప్రకటించినా..ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా గ్రానై ట్ రాజ్యమేలుతున్నా, అధికారులు మాత్రం రాతిగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసం జరుగుతు న్నా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పల్లె ప్రజ లు విస్మయానికి లోనవుతున్నారు. ఇక సీఎం ప్రకటనకే విలువ లేకుండా పోతుంటే.. తమకేం న్యా యం జరుగుతుందంటూ మదనపడుతున్నారు.
అక్రమాల నిగ్గు తేల్చడంలో విఫలం
గ్రానైట్ కట్టింగ్, పాలీిషింగ్ పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా అక్రమార్జనే ధ్యేయంగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పంచాయతీరాజ్ చట్టం– 2018కు లోబడి అనుమతులు పొందకుండా.. నిర్మాణ ఫీజు, బెట్టర్మెంట్ చార్జ్, డెవలప్మెంట్ చార్జీలు చెల్లించకుండా, ఆస్తి, టేడ్ర్ లైసెన్స్ పన్నులు ఎగవేస్తూ.. అక్రమ దందా సాగిస్తూ.. దుమ్ము, ధూళిని వెదజల్లుతూ.. శబ్ద, వాయు, జల కాలుష్యాన్ని నాశనం చేస్తూ.. మొక్కలు, చెట్లు నాటకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. రోడ్లను ధ్వంసం చేస్తూ..ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు గ్రానైట్ చూర్ణాన్ని డంప్ చేస్తూ..ఇలా అక్రమ దందా కొనసాగిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వ్యవహరిస్తున్న గ్రానైట్ పరిశ్రమల నిగ్గు తేల్చాల్సిన సంబంధిత అధికారులు మామూలుగా తీసుకుంటుండంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ పంచాయతీలకు మాత్రం పన్నులు చెల్లించకుండా నష్టం కలిగిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై విచారణ చేపడితేగాని నిజం నిగ్గుతేలనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారుల తీరుపై అసంతృప్తి
గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రానైట్ పరిశ్రమల అక్రమాలు నిస్సిగ్గుగా కొనసాగుతున్నా.. నిగ్గు తేల్చడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. అనేక పరిశ్రమలు సరైన లైసెన్సులు లేకుండా రాళ్ల రాజ్యం కొనసాగిస్తుంటే.. అధికారగణం మాత్రం రాతిగా వ్యవహరిస్తున్నారన్న అపవాదునెదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా గ్రానైట్ అక్రమ దందా అడ్డూఅదుపులేకుండా కొనసాగుతోంది.
అధికారులకు అడ్డుపడేదెవరు?
గ్రానైట్ పరిశ్రమల అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చ కుండా అధికారులను అడ్డుకుంటున్నదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో అడ్డూఅ దుపులేకుండా పోయిన పరిశ్రమల ఆగడాలు ఇప్పుడైనా ఆగుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. అక్రమ దందాకు అండగా నిలుస్తున్న ఆ బడానేత ఎవరన్నది పల్లెల్లో చర్చ సాగుతుండగా.. కేవలం బదనాం చేసేందుకే అక్రమార్కులు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెల్లో పెద్ద ఎత్తున్న గ్రానైట్ విధ్వంసం జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోగా..మళ్లీ అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


