
అదుపుతప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఓ కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనాలు ధ్వంసం కాగా, రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ, చిన్నారికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ కథలాపూర్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కాగా, డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు.
ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఉద్యోగం రావడం లేదని బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బసంతనగర్ ఎస్సై స్వామి కథనం ప్రకారం.. కన్నాల గ్రామ పంచాయతీ పరిధి శాలపల్లి గ్రామానికి చెందిన బండి నవీన్(27) 2018లో బీటెక్ చేశాడు. అప్పటినుంచి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయినా.. అనుకూలమైన ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు బండి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, నవీన్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

అదుపుతప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు