
కూతుళ్ల భవిష్యత్ కోసం..
జూలపల్లి(పెద్దపల్లి): జూలపల్లి మండలం అబ్బాపూర్కు చెందిన రైతు నౌండ్ల శ్రీనివాస్రెడ్డి, భారతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వ్యవసాయం కలిసిరాక పోయినా, కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో సిమెంట్ ఇటుకల పని ప్రారంభించారు. తండ్రి కష్టం తెలిసిన కూతుళ్ల పట్టుదలతో చదివి ఫలితం సాధించారు. పెద్ద కూతురు రమ్య జూలపల్లిలో పది, బాసరలో ట్రిపుల్ ఐటీ చదివి, బయోకాన్ సంస్థలో ఉద్యోగం సాధించగా పెళ్లి చేశారు. రెండో కూతురు రమ్య పది వరకు జూలపల్లిలో చదివి అగ్రికల్చర్ డిప్లొమాలో సీటు సాధించి వ్యవసాయ శాఖలో ఏఈవోగా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం సుల్తానాబాద్ మండలం గర్రెపెల్లి ఎఈవోగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈ మధ్యనే పెళ్లి చేశారు. మూడో కూతురు నీరజ జూలపల్లిలో పదివరకు ఇంటర్, బీ ఫార్మసీ పెద్దపల్లిలో చదివింది. ప్రస్తుతం బెంగళూరులో పేరోందిన కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రుల కష్టం చూసిన కూతుళ్లు వారి శ్రమ వృథా కాకుండా ఉన్నతంగా స్థిరపడ్డారు. కొడుకులు లేరన్న లోటు తీర్చారు. కాయకష్టం చేసి పిల్లలను చదివించిన శ్రీనివాస్రెడ్డి దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.