డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన

Jun 10 2025 3:36 AM | Updated on Jun 10 2025 3:36 AM

డీఎస్

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన

పారిశుధ్య సమాచారం అప్‌లోడ్‌ చేయని వైనం

పంచాయతీ కార్యదర్శుల సహాయ నిరాకరణ

కొత్త యాప్‌ నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. పాతయాప్‌కు కొన్ని సవరణలు చేశారు. ఆ ప్రకారం హాజరు, శానిటేషన్‌ నివేదికలను అప్‌లోడ్‌ చేయాలి. విధుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.

– వీరబుచ్చయ్య, డీపీవో

రామగిరి(మంథని): గ్రామ పంచాయతీల్లో చేపట్టే పారిశుధ్య నిర్వహణ నివేదికను డెయిలీ శానిటేషన్‌ రిపోర్ట్‌(డీఎస్‌ఆర్‌) యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌ లోడ్‌ చేయాలనే ప్రభుత్వ మార్గదర్శకాలపై పంచా యతీ కార్యదర్శులు నిరసన తెలుపుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా నివేదిక అందజేయడం తమకు భారంగా మారుతోందని వారు అంటున్నారు. 15రోజులుగా యాప్‌లో నివేదిక నమోదు చేయడం లేదు.

జిల్లాలో 260 మంది..

జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉంగా, మొత్తం 260 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. నిధులు విడుదల కావడంలేదు. పల్లెల్లో చిన్న సమస్య పరిష్కారానికై నా కార్యదర్శులే సొంతంగా నిధులు వెచ్చిస్తున్నారు. దీనికితోడు డీఎస్‌ఆర్‌ యాప్‌లో పారిశుధ్య నివేదికను నమోదు చేయాలని గతనెల 24న ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఈ నివేదిక తలనొప్పిగా మారిందని కార్యదర్శులు నిరసన తెలుపుతున్నారు.

ఎందుకు వద్దంటున్నారంటే..

ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చెత్త సేకరణ ప్రక్రియనూ పర్యవేక్షించాలనడంతో రోజువారీ పనులు పడకేస్తాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛభారత్‌ మిషన్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆహారభద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. తాజాగా డీఎస్‌ఆర్‌ యాప్‌ నిర్వహణ తలకు మించిన భారమవుతోందని చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సరిగ్గా అందుబాటులో ఉండడంలేదు. ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యాప్‌ అందుబాటులో ఉంటుందని, ఈలోగా ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యం వివరాలు నమోదు చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ఆందోళన చెందుతున్నారు.

డీఎస్‌ఆర్‌ యాప్‌లో ఇలా..

పంచాయతీ కార్యదర్శుల ఆధార్‌, వేలిముద్ర, ఫేస్‌ ద్వారా యాప్‌లోకి లాగిన్‌ కావాలి. ఆ సమాచారం మొత్తం సర్వర్‌కు వెళ్తుంది. దీనికితోడు పంచాయతీలోని నివాసాలు, ఆరోజు తడి, పొడి చెత్త సేకరించిన ఇళ్లు, సేకరించిన మొత్తం చెత్త, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, నర్సరీల ఫొటోలు తీసి యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి. ఇప్పటికే సుమారు 10 యాప్‌ల్లో సమాచారం నమోదు చేస్తున్న కార్యదర్శులు.. మరోయాప్‌లో మరింత సమాచారం అప్‌లోడ్‌ చేయడం కష్టమంటున్నారు.

కష్టాలు గుర్తించడం లేదు

పద్దెనిమిది నెలలుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. నిధులు మంజూరు కావడంలేదు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు, సమస్యల పరిష్కారానికి అప్పు లు చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులోనూ పాలుపంచుకుంటున్నాం. అయినా, మా కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. తాజాగా డీఎస్‌ఆర్‌ యాప్‌ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎంతపని చేసినా పనికి తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి మా సమస్యలను పరిష్కారించాలి.

– ఎడిపల్లి సంతోష్‌, జిల్లా అధ్యక్షుడు,

పంచాయతీ కార్యదర్శుల సంఘం

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన 1
1/2

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన 2
2/2

డీఎస్‌ఆర్‌ యాప్‌పై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement