దోమకొండ/ కామారెడ్డి టౌన్: ఆషాఢ మాసం బోనాల పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాలను ఊరేగించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దోమకొండ మండల కేంద్రంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. అనంతరం ఘటం ఊరేగింపు, రంగం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రంగసాని భవిష్యవాణి వినిపించారు. అమ్మను కొలిస్తే అన్నీ తానే చూసుకుంటుందని, సమృద్ధిగా వర్షాలు కురిపిస్తుందని భక్తులకు వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, మున్నూరు కాపు, యాదవ, స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు.


