అధికారులు స్పందించాలి
పనులు పూర్తి చేయించాలి
● సింగితం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 2023లో నిధులు మంజూరు
● బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
● ఇప్పటికీ పూర్తికాని వంతెన నిర్మాణం
నిజాంసాగర్(జుక్కల్): వంతెన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. మహమ్మద్ నగర్ మండలం సింగితం గ్రామ శివారులోని వాగుపైన హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023లో అప్పటి ప్రభుత్వం రూ. 4.8 కోట్లు మంజూరు చేసింది. వెంటనే పనులు ప్రారంభై, పిల్లర్ల నిర్మాణంతో పాటు వాగుకు దిమ్మెల నిర్మాణాలు జరిగాయి. కానీ పనులకు సంబందించి బిల్లుల చెల్లింపులో అధికారులు జాప్యం చేశారు. దీంతో సదరు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తేనే చేస్తానని మధ్యలోనే నిలిపి వేశారు.
ఇబ్బందుల్లో అన్నదాతలు
వాగు దాటితే నర్సాపురం, రాఘవపల్లి, రంగాపురం శివారుల్లో 800 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. స్థానిక రైతులు వర్షాకాలంలో వాగు దాటి వెళ్లడం, వరద ప్రవాహనికి చిక్కుకోవడం ప్రాణసంకటంగా ఉంది. అయితే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాగులో వరద ప్రవాహం కారణంగా వాగు దాటలేక పంటలు సాగు చేయలేక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, వంతెన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
సింగితం వాగుపై వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. వరద ప్రవాహం ముప్పు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కానీ పనులు జరుగడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– నవీన్రెడ్డి, ఆయకట్టు రైతు, సింగితం
వాగుపై వంతెన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయించాలి. వారం రోజు లుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు వరద నీటితో నిండాయి. ఆయకట్టు కింద పంటలు సాగు చేసేందుకు వెళ్లాలంటే వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో వాగు దాటలేక పంటలు సాగు చేయలేక పోతున్నాం.
– శ్రీకాంత్, ఆయకట్టు రైతు, సింగితం


