కామారెడ్డిఅర్బన్: మా చిన్నతనంలో వేసవి సెలవులంటే ఓ పండుగగా ఉండేది. నేను పుట్టి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్. అక్కడే పదవ తరగతి వరకు చదివాను. ఖానాపూర్కు అర కిలోమీటరు దూరంలో గోదావరి నది ఉండేది. అప్పటికింకా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించలేదు. వేసవి సెలవుల్లో ఉదయం లేచింది మొదలు దోస్తులతో కలిసి గోదావరిలో ఈతకు వెళ్లేవాళ్లం. అక్కడే మామిడి తోటల్లోకి వెళ్లి మామిడి పళ్లు తినేవారం. ఈత కల్లు తాగేవాళ్లం. మధ్యాహ్నం వరకు ఇంటికి చేరే లోపు చేసే అల్లరి పనులకు ఇంట్లో లొల్లి జరిగేది. నాలుగైదు సార్లు మా నాన్నతో దెబ్బలు సైతం తిన్నాను. నా స్నేహితులు మారన్న, మురళీధర్రావు సైతం అల్లరిగా ఉండేవారు. ఇద్దరు పోలీసు శాఖలో ఎస్పీ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు. 1973లో నేను ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి ఇంజనీర్ను అయ్యాను. కామారెడ్డిలో ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిర నివాసిని అయ్యాను. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినందకు సాక్షికి ధన్యవాదాలు.
– మారవేని రాజన్న, విశ్రాంత విద్యుత్ ఇంజనీర్, కామారెడ్డి


