మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ | - | Sakshi
Sakshi News home page

మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ

Jan 18 2024 1:14 AM | Updated on Jan 18 2024 1:14 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు ఎమ్మెల్సీ పదవిని అధిష్టానం కేటాయించింది. ఎన్‌ఎస్‌యూఐ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూ వచ్చారు. అనేక పార్టీ పదవులు నిర్వహిస్తూ వచ్చిన మహేశ్‌గౌడ్‌ ప్రస్తుతం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయమై అనేక ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య చివరి నిముషంలో ఖరారు కావడంతో జిల్లా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్య క్తం చేస్తున్నాయి. ఈ రెండు స్థానాలకు సంబంధించి బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌ పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు. అయితే చివరి నిముషంలో అద్దంకి దయాకర్‌ స్థానంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరును అధిష్టానం ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శక్తివంచన లేకుండా కృషిచేసిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పార్లమెంట్‌ ఎన్నికల తరువాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సైతం అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు బోధన్‌ నుంచి నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. సుదర్శన్‌రెడ్డి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో పనిచేశారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్‌గా ఉన్న సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌ బెర్త్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో విడతలో తప్పకుండా ఇస్తారని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉంటుందా, ఎన్నికల తరువాత ఉంటుందా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఉత్తర తెలంగాణ నుంచి, మరోవైపు బీసీ కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు సైతం అధిష్టానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్‌గౌడ్‌ నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్టు ఆశించారు. అయితే ఈ స్థానంలో మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో అధినాయకత్వం సూచన మేరకు టికెట్టును షబ్బీర్‌ అలీ కోసం త్యాగం చేశారు. పైగా పార్టీ ఆర్గనైజింగ్‌ వ్యవహారాలను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోనే పార్టీ అధినాయకత్వం మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు పీసీసీ పీఠం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. నలభై సంవత్సరాలు గా పార్టీకి సేవలందిస్తున్న మ హేశ్‌గౌడ్‌ ఎన్‌ఎస్‌యూఐ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ రా ష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, పీసీ సీ కార్యదర్శిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ దక్కడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా..

ఇప్పటికే పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా క్రియాశీలక పాత్ర

నాలుగు దశాబ్దాల సేవలకు ఫలితం

పార్లమెంట్‌ ఎన్నికల తరువాత పీసీసీ పీఠం సైతం అప్పగించే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement