ఉరకలు..పరుగులు
కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద వరద ఉధృతి
తీపర్రు పుష్కరాల రేవులో శివుడు విగ్రహం చెంతకు చేరిన వరద
ముక్కామలలో నీటమునిగిన ఆయిల్పామ్ తోట
నిండుకుండలా గోదావరి
కాటన్ బ్యారేజీ వద్ద రెండో
ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
ఎగువన క్రమంగా తగ్గుతున్న వరద
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉరకులు.. పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి నిండుకుండలా మారింది. ఆదివా రం ఉదయానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 15 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో 14,40,621 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి క్రమంగా వరద నీటి ప్రవాహం తగ్గుతున్నా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి కాటన్ వద్ద 14.6 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మరోవైపు మూడు డెల్టా కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అం‘తోటా’ మునకే..
వరద ఉధృతి పెరగడంతో కిందకు భారీగా నీరు విడిచిపెట్టడంతో పెరవలి మండలంలోని లంకలు నీట మునిగాయి. ఫలితంగా లంకల్లో సాగు చేస్తున్న అరటి, కంద, ఆయిల్పామ్, జామ, పూల తోటలు, కూరగాయల పంటలు ముంపుబారిన పడ్డాయి. సుమారు 2300 ఎకరాల్లో పంటలు వరద నీట ఉన్నాయి.
గోదావరి పరీవాహక గ్రామాలైన సీతానగరం మండలం పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, సీతానగరం, రఘుదేవపురం తదితర గ్రామాల్లో లంక భూములు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న దోస, ఆనబ పాదులు, 12 ఎకరాల్లో బొప్పాయి, 40 ఎకరాల్లో దొండపాదులు, 20 ఎకరాల్లో అరటి తోటలు నీట మునిగాయి.
మద్దూరులంక, పల్లిపాలెంలోని 17 కుటుంబాలకు చెందిన 39 మందిని మద్దూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లోకి భక్తులు, పర్యాటకుల ప్రవేశాన్ని రెండో రోజు కూడా నిలిపేశారు. పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


