
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్స్టేషన్కు గాని, 100కు కాల్ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు.