
1,310 కేసుల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: మూడు రోజుల క్రితం జిల్లాకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భూపాలపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 1,310 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు సీఐ నరేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు కేసులలో ఉన్న కక్షిదారులను ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు 15 రోజుల నుంచి స్వయంగా కలిసి రాజీమార్గంపై అవగహన కల్పించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సత్వరం న్యాయం జరుగుతుందని, ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇందుకు కృషిచేసిన ఎస్సైలు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.
నాపాక ఆలయంలో ప్రత్యేక పూజలు
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి సర్వతోభద్ర ఆది ఏకశిల దేవాలయంలో భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్–లక్ష్మీ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పెండ్యాల ప్రభాకరాచార్యులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. వారి వెంట సిరసనగల్లా శేషాచార్యులు, నీలిమ దంపతులు ఉన్నారు.
మిషన్ భగీరథ లీకేజీ..
మల్హర్: మండలంలోని వల్లెకుంట మహా రాజుల కాలనీ మూడు రహదారుల వద్ద మిషన్ భరీగథ నీరు లీకేజీ అవుతుంది. దీంతో నీరు వృథాగా పోతూ కలుషితమవుతుంది. నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చేసుకుంటున్నాయి. లీకేజీలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
వర్షాలు కురవాలని..
కాటారం: వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని కొత్తపల్లి తండావాసులు ఆదివారం వన భోజనాలకు తరలివెళ్లారు. కుటుంబ సమేతంగా సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లారు. వన దేవతలకు మొక్కులు సమర్పించారు. పెద్దలు, మహిళలు, చిన్నారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని తండాపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండాపెద్దలు ఆజ్మీర రాములునాయక్, ఊదానాయక్, జోహార్, సామెల్, హట్కర్ రావుజీ పాల్గొన్నారు.
ఐఎన్టీయూసీ యూత్ వింగ్ కన్వీనర్గా రామకృష్ణ
భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ బలోపేతానికి యువ శక్తి పోరాట పీఠిక పేరుతో యూత్ వింగ్ కన్వీనర్గా కుసుమ రామకృష్ణను నియమించినట్లు ఏరియా బ్రాంచీ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కో కన్వీనర్లుగా రాజ్కుమార్, సాయిప్రసాద్, క్రాంతికుమార్, నాగరాజు, సంతోష్, మోహినోద్దిన్, తిరుపతి, రామ్కుమార్, శ్రీనివాస్లను నియమించినట్లు చెప్పారు. కనీస వేతనాల సలహాల మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ను సమావేశం అనంతరం గోదావరిఖనిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, రఘుపతిరెడ్డి, చక్రపాణి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శంకర్, అన్ని గనులు కార్యదర్శులు, యువ కార్మికులు పాల్గొన్నారు.

1,310 కేసుల పరిష్కారం