
నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల
ములుగు రూరల్: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని గ్రంథాలయ సంస్థచైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రతీ సోమవారం బిల్లు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, భోడ రఘు, అనిల్, షకిల్, జాఫర్, అభినయ్, రాజన్న, మహేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
మంజూరు పత్రాలు ఇచ్చి లాక్కున్నారు..
వాజేడు: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను ఇచ్చారని, మీరు అర్హులు కారని తిరిగి తీసుకున్నారని మండల అంగన్వాడీ సిబ్బంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలతలతో కలిసి భద్రాచలం వెళ్లారు. తమకు గత నెల 7న మంత్రి పర్యటనలో భాగంగా మంజూరు పత్రాలను ఇవ్వడంతో 5 రోజులు ఆగి తాము కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి పాత ఇంటిని తొలగించినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు.