● రైతులకు రూ.363.41 కోట్లు చెల్లింపు
జనగామ: వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ హథీరామ్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం తరలింపులో జాప్యంపై ఇటీవల సాక్షిలో జనగామ, కొడకండ్ల, రఘునాథపల్లి మండలాల నుంచి ప్రచురితమైన కథనాలకు సివిల్ సప్లయీస్ డీఎం స్పందించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 2,01,745 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 1,93,484 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.363.41 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. కేవలం 8,261 మెట్రిక్ టన్నులు (4శాతం) మాత్రమే ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రఘునాథపల్లి, కొడకండ్ల, నర్మెట మండలాల్లో మిగిలిన నిల్వలను తరలించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు అదనపు వాహనాలు రంగంలోకి దింపినట్లు చెప్పారు. వర్ష సూచనల నేపథ్యంలో రెండు మూ డు రోజుల్లో మిగిలిన కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు.


