హన్మకొండ చౌరస్తా: మూల మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకోవడం.. డ్రైవర్ అలానే ముందుకు వెళ్లడంతో చెట్ల కొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న పలువురు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హనుమకొండ వస్తోంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్దకు చేరుకోగానే పక్కనే ఉన్న వృక్షం పక్కనుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకున్నాయి. గమనించని బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతో భారీ వృక్షం కొమ్మలు విరిగి రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలపై పడ్డాయి. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేదా గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడున్న పలువురు ఆరోపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సుపై పడిన కొమ్మలను తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
చెట్టుకొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వసం


