ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదివారం పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు.
ఘనంగా సంకటహర చతుర్థి
ధర్మపురి: సంకటహర చతుర్థి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
బీఆర్ఎస్ హయాంలోనే వ్యవసాయానికి ప్రాధాన్యం
వెల్గటూర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయం, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని కోటిలింగాల పుణ్యక్షేత్రంలో శ్రీపార్వతికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గోదావరి ప్రవహించిందని, అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చి.. ఎల్లంపల్లిని కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రీడిజైన్ చేసి.. గోదావరి జలాలను రాష్ట్రమంతా అందించారని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తికాకముందు ఎల్లంపల్లి కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమేనని, కాళేశ్వరం అనేక రిజర్వాయర్లు, పంప్హౌస్లు, కాలువల కలయిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 19,457 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1074.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 80.5 టీఎంసీలకు 31.918 టీఎంసీలకు చేరింది.


