జగిత్యాల: బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్ఐఎస్), డబుల్ ఎంట్రీ అక్రువల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏబీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకేంద్రంలో శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇలా ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో కొన్ని ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురికాగా.. మరికొన్ని కనుమరుగయ్యాయి. అలాంటి వాటిపై దృష్టి సారిస్తే ప్రభుత్వ స్థలాలు అనేకం బయటకొచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆస్తుల నమోదుకు చర్యలు
మున్సిపాలిటీల స్థిరాస్తి వివరాలను జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపాలిటీల్లో కొన్ని ఆస్తులు కనుమరుగుకాగా.. మరికొన్ని కబ్జాకు గురయ్యాయి. మున్సిపల్ ఆస్తులను గుర్తించి డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ల పరిధిలో ఉన్న భూములు, భవనాలు, తదితర ఆస్తుల వివరాలు గుర్తించి ధ్రువీకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ ఆస్తుల రిజిస్టర్ కూడా భౌతికంగా, డిజిటల్ రూపంలో నిర్వహించడంతోపాటు ఏటా ఏప్రిల్లో సరిచూసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఆస్తుల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ విషయంలో నిత్యం పర్యవేక్షించాలని ఆర్డీఎంఏకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మున్సిపల్ స్థిరాస్తులకు సంబంధించి జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్లో డేటాబేస్లో నమోదు చేసేలా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ప్రారంభించి మున్సిపల్ ఆస్తులను గుర్తించి నమోదు చేసి మ్యాపింగ్ పూర్తి చేస్తాం.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్


