వీణవంక: విద్యుత్ సమస్యలు పరిష్కరించే క్రమంలో సమన్వయ లోపంతో చాలా మంది సిబ్బంది కరెంటు స్తంభంపైనే ప్రాణాలు వదిలారు. సిబ్బంది రక్షణ, విద్యుత్ ప్రమాదాల నివారణ, గంటల తరబడి అంతరాయం కలగకుండా ఉండేందుకు టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్చేసి ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకొని మరమ్మతు చేసేవారు. దీంతో గంటల తరబడి అంతరాయం ఏర్పడేది. ఆపరేటర్, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది మధ్య సమస్వయ లోపంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టీజీ ఎన్పీడీసీఎల్ ఆన్లైన్ ఎల్సీకీ శ్రీకారం చుట్టింది. ఎల్సీ తీసుకోవాలంటే ఆన్లైన్ అనుమతి తప్పనిసరి చేశారు. విద్యుత్ వైర్లు, ఫీడర్, ఫీజు సరి చేయాలంటే లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్స్థాయి అధికారి ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేస్తే ఏఈ పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడే సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారికి సమాచారం ఇస్తారు. తద్వారా క్షేత్రస్థాయిలో ప్రమాదాలను తగ్గించడంతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని గ్రామాల్లో విజయవంతంగా అమలవుతోంది.
ఆన్లైన్ ఎల్సీ ఇలా..
జిల్లావ్యాప్తంగా 318 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 200కు పైగా విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. గతంలో గ్రామాల్లో విద్యుత్ పోలు, వైర్లు, ఫీడర్లు, ఫీజులు తదితర సమస్యలు తలెత్తితే సంబంధిత సబ్స్టేషన్ ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకునేవారు. ఆపరేటర్కు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి మాత్రమే ఈ సమచారం ఉండేది. ఫై స్థాయి అధికారులకు సమాచారం లేకపోవడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్లో డేటా సిస్టం ఏర్పాటు చేసి కిందిస్థాయి సిబ్బంది నుంచి సీఎండీ వరకు ఎల్సీ సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. ఏదైన సమస్య తలెత్తితే ఆన్లైన్లో సమస్య ఫొటో అప్లోడ్ చేయాలి. ఏఈ పరిశీలించి ఆపరేటర్కు అనుమతి ఇస్తాడు. అప్పుడు సబ్స్టేషన్లో సరఫరా నిలిపివేస్తూ, ఆ ఫొటోను ఆపరేటర్ ఆప్లోడ్ చేస్తాడు. మరమ్మతు పూర్తయిన తర్వాత మళ్లీ సిబ్బంది ఫొటో తీసి ఆన్లైన్లో పెడతారు. వెంటనే ఆపరేటర్ సరఫరా పునరుద్ధరిస్తారు. దీంతో ఎన్నిసార్లు ఎల్సీ తీసుకున్నారో పైస్థాయి అధికారులకు తెలిసిపోతుంది. మరమ్మత్తు 2గంటల లోపు ఉంటే ఏఈ, 2గంటల పైన అవసరముంటే డీఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని
ఓ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి ఏడాది క్రితం విద్యుత్ వైర్లు సరి చేసేందుకు సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకున్నాడు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. షాక్ తగిలి విద్యుత్ పోలు నుంచి కిందపడగా
తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకారం చుట్టిన టీజీఎన్పీడీసీఎల్
క్షేత్రస్థాయిలో మరమ్మతుకు ఆన్లైన్ ఆనుమతి తప్పనిసరి
విద్యుత్ ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు
ఏజేఎల్ఎం నుంచి సీఎండీ వరకు యా్ప్లో పరిశీలించే అవకాశం


