తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీ కాలనీ అండాల్ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇటీవలే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లకు అర్చకులు ఆభరణాలు అలకంరించారు. ఈ విషయం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం గుడికి తాళం వేసి అర్చకులు ఇంటికి వెళ్లారు. మంగళవారం వేకువజామున శుభ్రపరచడానికి వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టబడి ఉండటం గమనించారు. వెంటనే అర్చకులకు సమాచారం అందించారు. అర్చకులు వచ్చి చూడగా స్వామి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించలేదు.
ఆలయంలో గునపం, వాటర్ బాటిల్...
చోరీకి వచ్చిన దొంగలు వెంట గునపం, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు. గునపంతో తాళం పగలగొట్టి లోకిని ప్రవేశించి ఆభరణాలు అన్నీ మూటగట్టుకుని వెళ్లారు. చోరీ అయిన సొత్తు విలువ దాదాపు రూ.10 లక్షల పైగా ఉంటుందని అర్చకులు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్, క్లూ టీమ్లకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
రూ.10 లక్షల విలువగల ఆభరణాలు అపహరణ


