
ట్యాపింగ్!
నీడలా వెంటాడారు.. డ్రైవర్ ఫోనూ ట్యాప్ చేశారు..● సిట్ ముందు గ్రంథాలయ జిల్లా చైర్మన్ మల్లేశ్ వాంగ్మూలం ● ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఈటల రాజేందర్ ● బండి సంజయ్, ఆయన పీఆర్వో విచారణ వాయిదా ● త్వరలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకూ నోటీసులు
నాలుగున్నరేళ్లపాటు
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నరేళ్లపాటు నా ఫోన్ ట్యాప్ అయింది. నాదే కాదు.. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అనుక్షణం నీడలా వెంటాడారు.. పలుమార్లు మమ్మల్ని అడ్డగించారు.. మా వ్యక్తిగత సమాచారం తస్కరించారు. ప్రతీక్షణం మా మాటలు విన్నారు..’ ఇవీ.. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ ఫోన్ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట చెప్పిన మాటలు. ఏడాదిన్నరగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ మంగళవారం హైదరాబాద్లోని సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఇద్దరు అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ఫోన్ట్యాపింగ్ ద్వారా ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులను పోలీసులకు సత్తు మల్లేశ్ వివరించారు.
ఉమ్మడి జిల్లాతో లింకు..
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు కరీంనగర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు బంధువులు కరీంనగర్కు చెందిన వారు కావడం, ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు పలుమార్లు కరీంనగర్కు వచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలడం, అలాగే ఈకేసులో సిరిసిల్ల ఎస్సీఆర్బీ డీఎస్పీగా దుగ్యాల ప్రవీణ్రావును సిరిసిల్లలోనే అరెస్టు చేయడం తెలిసిందే. అసలు అతని అరెస్టుతో సిట్ బృందం దర్యాప్తు వేగం పెంచింది. వాస్తవానికి 2021లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై కరీంనగర్లోని మైత్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు, వేణుగోపాల్రావు, దుగ్యాల ప్రవీణ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
‘బండి’ నుంచి మల్లేశ్ వరకు..
ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ సిట్ బృందం ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కు హాజరు కావాలని సిట్ అధికా రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. పార్లమెంటు సమావేశాలు, ఆపరేషన్ సిందూర్పై చర్చల కారణంగా బండి సంజయ్ విచారణకు రాలేనని సమాధానమిచ్చారు. బండి సంజయ్ తోపాటు ఆయన ఆంతరంగికుడు ప్రవీణ్రావు, ఆయన పీఆర్వో పసూనూరి మధుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయని, వారు కూడా విచారణకు రా వాలని సిట్ కోరిన సంగతి తెలిసిందే. త్వరలోనే బండి సంజయ్ ఆయన అనుచరులు కూడా సిట్ ముందు హాజరై.. వాంగ్మూలం ఇవ్వనున్నారు.
● ఇక కరీంనగర్కు చెందిన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా గత నెలలో సిట్ ఎదుట విచారణకు హాజరై తన అనుభవాలను వివరించారు.
● సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన.. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని.. పోలీసులు స్వాధీ నం చేసుకున్న పలు డివైజ్ల ద్వారా అప్పట్లోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
● ఇక ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం ఫోన్లు కూడా ట్యాపయ్యాయని సమాచారం. త్వరలోనే ఆయనకు కూడా విచారణ కోసం సిట్ నుంచి పిలుపు రావొచ్చని తెలిసింది.

ట్యాపింగ్!

ట్యాపింగ్!

ట్యాపింగ్!

ట్యాపింగ్!