
వామ్మో బడి ఫీజులు
● ఆందోళనలో తల్లిదండ్రులు ● ఏటేటా పెరుగుతున్న ఖర్చులు ● ఎల్కేజీకే తడిసిమోపెడు
జగిత్యాల: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు పాఠశాలలనే ఆశ్రయిస్తుంటారు. దీనిని ప్రైవేటు యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్మీడియంలో లేకపోవడంతో అధిక ఫీజులు చెల్లించయినా తమ పిల్లలను ప్రైవేట్కే పంపిస్తున్నారు. ఎల్కేజీకే ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తోంది. వీటికితోడు బుక్కులు, టై, షూస్, యూనిఫాం ఖర్చులు అదనం.
మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చూసి మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక స్కూల్ ఫీజే కాకుండా పుస్తకాలు, పిల్లలకు యూనిఫాంలతోపాటు, టై, బెల్ట్, షూలు కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ వాటికి కూడా సపరేట్గా వసూలు చేస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫీజులు కట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. కొంత మంది అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. ఆటో, కారు డ్రైవర్ మొదలు.. ప్రైవేటు ఉద్యోగుల పిల్లలు కూడా ఎక్కువగా ప్రైవేటు పాఠశాల ల వైపే మొగ్గు చూ పుతున్నారు. పిల్లల భవిష్యత్ కోసం అంటూ తల్లిదండ్రులు కూడా ఎంత ఫీజులైనా భరించి చెల్లిస్తున్నారు.
ఆకర్షణీయమైన పేర్లతో..
జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా వివిధ సిలబస్ అంటూ మభ్యపెడుతున్నారు. కొన్ని స్కూళ్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ టెక్నో, ఐఐటీ అని, డీజీ ఇలా తోకపేర్లు తగిలిస్తూ.. అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నారు. ఆకర్షణీయమైన రూపంలో ప్రింట్ చేసిన బ్రోచర్లతో ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపిస్తూ.. ప్రచారం చేస్తూ స్కూళ్లలో జాయిన్ చేసుకుంటున్నారు.
వసతులు అంతంతే..
జిల్లాలోని కొన్ని పాఠశాలలో వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొందరు సిటీ మధ్యలో ఏర్పాటు చేయగా.. కొందరు శివారు ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ఇరుకు ఇరుకు గదుల్లోనే క్లాసులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఏకంగా సెల్లార్లోనే పాఠాలు బోధిస్తున్నారంటే వారి తీరును అర్థం చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీగానీ, ప్లే గ్రౌండ్స్గానీ, ఇతరత్రా వసతులు ఏమీ ఉండకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
నియంత్రణ ఎక్కడ?
ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఉత్తర్వులు జారీ చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.