
ఉపాధ్యాయుల సర్దుబాటు
● మెరుగైన విద్య కోసం.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ● చర్యలు తీసుకుంటున్న అధికారులు
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్య మెరుగుపడిందని చెప్పొచ్చు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నాలుగో స్థానం సాధించింది. మొదటి స్థానం చేరుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తిస్థాయి అడ్మిషన్లు అయ్యాక పిల్లల సంఖ్యను బట్టి మళ్లీ సర్దుబాటు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్దుబాటును కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో లేకుండా ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సర్దుబాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. పరస్పర బదిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దన్న ఆదేశాలున్నాయి.
ఉత్తర్వులు ఇలా..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే అవకాశముంది. 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఉంటే ఇద్దరు, 90 లోపు ఉంటే ముగ్గురు, 120లోపు ఉంటే నలుగురు, 150 వరకు ఐదుగురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు, 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బడిబాటతో విద్యార్థుల సంఖ్య పెరిగేనా..?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కసరత్తు చేస్తున్నారు. మెరుగైన ఫలితాలు రావడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు
స్కూల్ అసిస్టెంట్లు
సోషల్ 300
ఫిజికల్ డైరెక్టర్స్ 112
మొత్తం 3,612
మ్యాథ్స్ 354
ఫిజిక్స్ 281
బయాలజి 275
తెలుగు 309
హిందీ 237
ఇంగ్లిష్ 290
పీజీ హెచ్ఎంలు 175
ఎస్జీటీ (తెలుగు) 1,230
ఎస్జీటీ (ఉర్దూ) 49
మెరుగైన విద్య అందించాలనే..
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం. గతంలోనూ ఇలాగే చేపట్టాం. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉన్నారు. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం సర్దుబాటు చేపడతాం.
– రాము, డీఈవో

ఉపాధ్యాయుల సర్దుబాటు