రైలు రగడ! | - | Sakshi
Sakshi News home page

రైలు రగడ!

Jun 14 2025 7:35 AM | Updated on Jun 14 2025 7:35 AM

రైలు రగడ!

రైలు రగడ!

● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్‌లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్‌, స్లీపర్‌ కోచ్‌లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

తాజాగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి– కరీంనగర్‌ మార్గంలో వేసిన ప్రత్యేక రైలు 012761, 012762 ప్రారంభానికి ముందే రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రత్యేక రైలు తమ వల్ల వచ్చిందని బీజేపీ, కాదు తామే తెచ్చామని కాంగ్రెస్‌ పార్టీలు ఘనతను చాటుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వర్గాల మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ రైలు విషయంలో రాజకీయాలు కాసేపు పక్కనబెడితే సదుపాయాలపై ప్రయాణికులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ రైలు జూలైలో ప్రతీ ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్‌లో బయల్దేరి, మంగళవారం ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలైలో తిరుపతి భక్తుల కోసం మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణికుల అసంతృప్తి

ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్‌ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్‌, జనరల్‌ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్‌ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్‌ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్‌ బై వీక్లీ 12762/61 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కేవలం 12స్టాప్‌లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్‌ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్‌ ధర రూ.1355. కరీంనగర్‌ నుంచి తిరుపతి రెగ్యులర్‌ బై వీక్లీ 12762 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్‌ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్‌ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి.

విఫల ప్రయోగంగా

జూలైలో ఏసీ రైలు వేయడం అందులోనూ మొత్తం బోగీలు థర్డ్‌ ఏసీ వేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఏళ్లుగా తిరుపతి రైలును రెగ్యులర్‌ చేయమంటే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య లేదని సమాధానమిస్తున్నారు. తీరా వర్షాకలంలో ఏసీ రైలు వేయడం, జనరల్‌ స్లీపర్‌ లేకుండా థర్డ్‌ ఏసీ వేయడంతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోతుందని, దీన్ని సాకుగా చూపి భవిష్యత్తులో తిరుపతి రైలును రెగ్యులర్‌గా చూపించరేమోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement