ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల అసంతృప్తి
సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ బయటకు..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులపాటు పొడిగించేందుకు, హార్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం పట్ల ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దీన్ని పరిశీలించిన ట్రంప్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సిచ్యుయేషన్ రూమ్లో తన సలహాదారులతో చర్చించానని, ఇరాన్తో ఒప్పందంపై అతిత్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, డీల్పై సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఇరాన్తో చేసుకొనే ఏ ఒప్పందమైనా అమెరికాకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం డీల్ విషయంలో అమెరికాతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్తో మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించడం గమనార్హం.


