
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ల మధ్య సయోధ్య కుదిర్చానని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలోనూ తన కొత్త వాదన వినిపించారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఐదు జెట్లు కూలిపోయాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్లో రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ప్రైవేట్ విందులో ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏ దేశ విమానాలను ఎవరు కూల్చివేశారనేది ఆయన వెల్లడించలేదు.
ఎటువంటి ఆధారాలు లేకుండానే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా పాకిస్తాన్ గతంలో.. తమ వైమానిక దళం భారత జెట్ విమానాలను కూల్చివేసిందని, వాటిలో మూడు ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయని, అలాగే భారత్ పైలట్లను తాము బంధించామని చెబుతూవస్తోంది. అయితే పాక్ ఈ వాదనలను ధృవీకరించేందుకు ఎటువంటి అధారాలను చూపకుండానే తప్పుడు కథనాలను అల్లుతోందని భారత్ ఆరోపిస్తోంది. కాల్పుల విరమణ తర్వాత భారత వైమానిక దళం (ఐఏఎస్) భారత్ విమానాలను కోల్పోయిందని అంగీకరించినప్పటికీ, ఆరు భారతీయ జెట్లు ధ్వంసం అయ్యాయనే పాకిస్తాన్ కథనాన్ని తోసిపుచ్చింది.
#WATCH | Washington, D.C.: US President Donald Trump says, "We stopped a lot of wars. And these were serious, India and Pakistan, that was going on. Planes were being shot out of there. I think five jets were shot down, actually. These are two serious nuclear countries, and they… pic.twitter.com/MCFhW406cT
— ANI (@ANI) July 18, 2025
జూన్ 15న రాఫెల్ ఫ్రెంచ్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ వాదనలను తప్పుబట్టారు. మూడు రాఫెల్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెప్పడం నిజం కాదని ఆయన ఫ్రెంచ్ మ్యాగజైన్ ఛాలెంజెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు మే 11న భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని ఎయిర్ మార్షల్ ఎకె భారతి మీడియాకు తెలిపారు. కాగా ఆపరేషన్ సిందూర్ జరిగి నెలలు గడుస్తున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ భారత్- పాక్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి మాట్లాడుతున్నారు. వాణిజ్య ఒప్పందం పేరుతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగేలా చూశానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ అమెరికా దౌత్య జోక్యం ఫలితంగా జరిగిందని ట్రంప్ తరచూ చెబుతుండటాన్ని భారత్ నిరంతరం ఖండిస్తూ వస్తోంది.