లుబ్లియానా: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా పడుతోంది. ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనే ప్రయత్నంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశం స్లోవేనియా ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. దీంతో వాహన దారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, ఇతర సహజ వనరులు రవాణా చేసే నౌకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ అంతరాయాలను ఎదుర్కొనేందుకు స్లోవేనియా కొత్త చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది.
స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయంతో ఆ దేశంలోని పెట్రోల్, డీజిల్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో వాహన దారులకు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇంధన రేషన్ రూల్స్లో భాగంగా వ్యక్తిగత వాహనదారులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల ఇంధనం వరకు కొనుగోలు చేసుకోవచ్చు. వ్యాపారాలు, రైతులకు మరింత సడలింపు ఇచ్చి రోజుకు 200 లీటర్ల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
ఇంధనం కొరత లేదు
‘స్లోవేనియాలో తగినంత ఇంధనం ఉంది. ఇంధనం గిడ్డంగులు నిండుగా ఉన్నాయి. ఇంధన కొరత ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ప్రధాన మంత్రి రాబర్ట్ గోలోబ్ అన్నారు. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయాలను అక్కడి పెట్రోల్ బంకులు నిర్వాహకులే అమలు చేయాలి. వినియోగదారులు అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేసుకోకుండా ఉద్యోగులు నిర్ధారించుకోవాలి. ఈ సందర్భంగా విదేశీ డ్రైవర్ల కోసం కఠినమైన పరిమితులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇంధన విక్రయ సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది.
ఈ చర్యల ఫలితంగా స్లోవేనియాలో ‘ఫ్యూయల్ టూరిజం’ ఊపందుకుంది. స్లోవేనియాలో పెట్రోల్,డీజిల్ తక్కువ ధరకే లభ్యం కావడంతో దాని సరిహద్దు దేశాల ప్రజలు సైతం క్యూకట్టారు. స్లోవేనియాకు వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు.


