ఖైదీలపై కాల్పులు  | Nepal Crisis Deepens as 13,000 Prisoners Escape Amid Violent Clashes and Army Crackdown | Sakshi
Sakshi News home page

ఖైదీలపై కాల్పులు 

Sep 11 2025 11:29 AM | Updated on Sep 12 2025 4:55 AM

Nepal Prison Breaks Escalate Amid Anti Corruption Protests

ముగ్గురి మృతి 

నేపాల్‌లో కొనసాగుతున్న ఖైదీల పరారీపర్వం 

మొత్తంగా 25 జైళ్ల నుంచి బయటపడ్డ 15,000 మంది ఖైదీలు 

కర్ఫ్యూ సమయంలో కాస్త సడలింపు 

ఇంకా భయం గుప్పిట్లో నేపాలీలు 

కాఠ్మండు: నేపాల్‌లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. 

మాధేశ్‌ ప్రావిన్సులోని రామెఛాప్‌ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు. జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్‌ సిలిండర్‌ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు.  

భారత్‌లోకి ఖైదీల చొరబాటు యత్నం 
కల్లోల నేపాల్‌ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్‌ సమీప ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్‌ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) విజయవంతంగా అడ్డుకుంది. 

సరిహద్దు సమీపంలోని రౌతహాత్‌ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్‌ఎస్‌బీ గుర్తించింది. నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్‌ పోలీసులకు ఎస్‌ఎస్‌బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్‌ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్‌ పోలీసులకు అప్పగించామని ఎస్‌ఎస్‌బీ అధికారి వెల్లడించారు. భారత్‌కు తూర్పున నేపాల్‌ వెంట 1,751 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు కాపలా, పర్యవేక్షణా బాధ్యతలను ఎస్‌ఎస్‌బీ చూసుకుంటోంది. 
 

పెట్రోల్‌ బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు 
కర్ఫ్యూ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. సైన్యం రంగంలోకి దిగడంతో హింసాత్మక ఘటనలు సద్దుమణిగాయి. శనివారం ఉదయం ఆరు గంటలదాకా దేశవ్యాప్త కర్ఫ్యూ కొనసాగుతుందని సైన్యం ప్రకటించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడింటిదాకా కర్ఫ్యూను సడలించారు. ఇప్పటికే కర్ఫ్యూ కారణంగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బంకుల్లో పెట్రో నిల్వలు నిండుకున్నాయి. 

అయితే కాస్తంత పెట్రో నిల్వలు ఉన్న బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి.  కానీ జనం ముఖాల్లో భయంఛాయలు పోలేదు. పౌర ప్రభుత్వాన్ని త్వరగా కొలువుతీర్చాలని రచయితలు, విద్యావేత్తలు అధ్యక్షుడిని కోరుతూ లేఖలు రాశారు. అయితే సనాతన ధర్మా న్ని కాపాడాలంటే మళ్లీ రాచరిక వ్యవçస్థను పునరుద్ధరించాలని జ్యోతిష్‌ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి డిమాండ్‌చేశారు.  

పూర్తిగా దగ్ధమైన సుప్రీంకోర్టు 
అవినీతి, వారసత్వ రాజకీయాలు, అసమర్థ పాలన, సోషల్‌మీడియాపై నిషేధం కారణాలతో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహజ్వాలల్లో అధికార కేంద్రాలు కాలిపోయాయి. న్యాయవితరణ చేసే ధర్మాసనాలూ దగ్ధమయ్యాయి. సుప్రీంకోర్టు మసిబారింది. అయినాసరే ఆదివారం నుంచి కేసుల విచారణను మొదలెడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ నిబద్ధతను చాటారు. 

‘‘నేపాల్‌ న్యాయవ్యవస్థకు సంబంధించిన పత్రాలెన్నో బుగ్గిపాలయ్యాయి’’అని ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ మాన్‌ రౌత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. బనేపా మున్సిపాలిటీలోని నయాబస్తీలో ఎనిమిది బాంబులను సైన్యం గుర్తించి జాగ్రత్తగా నిరీ్వర్యం చేసింది. జైళ్ల నుంచి పారిపోతూ ఖైదీలు ఎత్తుకెళ్లిన డజన్లకొద్దీ ఆయుధాలను సైన్యం తిరిగి స్వా«దీనంచేసుకుంది. మరోవైపు నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగుప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement