పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. యుద్ధ స్థావరాలపై ఇరాన్-అమెరికాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులు, ప్రతిదాడుల మధ్య గల్ప్ దేశాల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు వచ్చిన వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ప్రయోగించిన అనేక క్షిపణులు లక్ష్యాలను చేరలేక మార్గమధ్యంలో కూలిపోయాయని వివరించింది.
ఇదే సమయంలో ప్రతిస్పందన చర్యల్లో భాగంగా అమెరికా ఇరాన్లోని క్వెష్మ్ ద్వీపంలోని ఒక సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ చర్యల్లో తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేసినట్లు ప్రకటించగా, ఆ వాదనలను అమెరికా “పూర్తిగా అసత్యం”గా ఖండించింది.
ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. బహ్రెయిన్ తన ఆకాశ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయగా, కువైట్, యూఏఈలలో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యమవడం, మార్గమధ్యంలో నిలిపివేయడం, మార్గాలు మార్చుకోవడం వంటి పరిస్థితులు కనిపించాయి.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ మార్గాల్లో సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. ఏజియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ బాల్టిక్, ఎయిర్ కెనడా, ఎయిర్ ఫ్రాన్స్-KLM, లుఫ్తాన్సా, స్విస్ , ITA ఎయిర్వేస్ వంటి సంస్థలు దుబాయ్, టెల్ అవీవ్, బీరూట్, రియాద్ మార్గాల్లో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు తప్పవని అధికారులు అంటున్నారు.
పర్షియన్ గల్ఫ్లో కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసరాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో చమురు, గ్యాస్ రవాణాపై కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి ప్రయత్నాలు ఈ తాజా ఘటనలతో మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.


