అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది.


