
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్లో నార్త్ యార్క్షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు.
సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు.