ఎగిరే ట్యాక్సీలు | First electric planes in America | Sakshi
Sakshi News home page

ఎగిరే ట్యాక్సీలు

Jun 29 2025 4:28 AM | Updated on Jun 29 2025 4:28 AM

First electric planes in America

అమెరికాలో తొలిసారి విద్యుత్‌ విమానాలు

మనదేశంలో 2026 నాటికి అందుబాటులోకి

తయారీకి 2 కంపెనీలను ఎంపిక చేసిన డీజీసీఏ

రూ. 2,000–3,000 వరకు ఎయిర్‌ టాక్సీ చార్జీ!

పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా జూన్‌ 3న అమెరికాలో ‘అలియా సీఎక్స్‌300’ అనే విద్యుత్‌ విమానం ఐదుగురు ప్రయాణికులతో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. 130 కి.మీ. ప్రయాణానికి దీనికి పట్టిన సమయం 35 నిమిషాలు కాగా, ఇంధనానికి (విద్యుత్‌కు) అయిన ఖర్చు సుమారుగా రూ.700.   అంత చౌకగా విమానయానాన్ని సాధ్యం చేయటంలో కొత్త శకానికి నాంది పలికిన ఈ విమానం.. మనదేశ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ అభివృద్ధి ప్రయత్నాలకూ పరోక్షంగా ప్రోత్సాహాన్నిచ్చింది. అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్‌)లో భాగంగా ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిన మనదేశం వచ్చే ఏడాది నాటికి ఈ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తోంది.

2023లో బెంగళూరులో జరిగిన ఒక అధ్యయనంలో.. ప్రైవేటు వాహనాలు వాడే ఉద్యోగుల్లో 57 శాతం, ప్రజా రవాణా ద్వారా ప్రయాణించే ఉద్యోగుల్లో 55 శాతం మంది కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారని తేలింది. ఆలస్యం కారణంగా ఏడాదిలో సుమారు 7 లక్షల పని గంటలు నష్టపోయారని అంచనా. 2023లో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా కోల్పోయిన పని గంటల వల్ల ఒక్క బెంగళూరు నగరమే 200 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది.

పట్టణాల్లో ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు తక్కువ వ్యవధిలో గమ్యానికి చేర్చే అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్‌) ఎంతో ఉపయోగపడుతుందని ‘స్కై వేస్‌ టు ద ఫ్యూచర్‌ – ఆపరేషనల్‌ కాన్సెప్ట్స్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ మొబిలిటీ ఇన్‌ ఇండియా’ నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్, భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

అంతర్జాతీయ సంస్థలతో కలిసి..
మానవ రహిత ఎయిర్‌ ట్యాక్సీ, ఎయిర్‌ మొబిలిటీలో నూతన ఆవిష్కరణల కోసం.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), యూరోపియన్‌ యూనియన్‌ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, ఈ వ్యవస్థ నిర్వహణ కోసం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ), అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి వాటితోనూ మనదేశం కలిసి పనిచేస్తోంది. విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీలపై అధ్యయనం చేసేందుకు డీజీసీఏ 7 వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటుచేసిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ గ్రూపులు దృష్టి సారిస్తున్న అంశాల్లో ప్రధానమైనది  వెర్టిపోర్టులు (ఎయిర్‌ ట్యాక్సీల కోసం ప్రత్యేకించిన ఎయిర్‌పోర్టులు. సాధారణ హెలికాప్టర్‌ మాదిరిగానే ఎయిర్‌ ట్యాక్సీలు నిలువుగా టేకాఫ్‌ అవుతాయి. అదే విధంగా ల్యాండ్‌ అవుతాయి.). ఇంకా అటానమస్‌ డ్రోన్ల ట్రాఫిక్‌ వ్యవస్థ, ఎయిర్‌ ట్యాక్సీల  నిర్వహణ, మరమ్మతులు, నియంత్రణ మార్గదర్శకాలు, సురక్షిత ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతుల వంటి అంశాలపై ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి.

రెండు దశల్లో విస్తరణ
భారత్‌లో తొలి విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ 2026 అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీలు 2026 నాటికి ఎయిర్‌ ట్యాక్సీలను మొదట ఢిల్లీ–ఎన్ సీఆర్, ముంబై, బెంగళూరులలో ప్రారంభించి, తదుపరి దశలో చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు విస్తరింపజేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీల విధి విధానాలు ఖరారు అయ్యాక ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఐజీఇ), అమెరికా ఎయిర్‌ ట్యాక్సీ తయారీ కంపెనీ ‘ఆర్చర్‌ ఏవియేషన్‌’తో కలిసి ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుందట. 

చార్జీలు ఎంత ఉండొచ్చు?
ఎయిర్‌ ట్యాక్సీ చార్జీలు ప్రస్తుతం ఉన్న క్యాబ్‌ చార్జీల కంటే కాస్త మాత్రమే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం క్యాబ్‌లో ఢిల్లీ నుండి గుర్గావ్‌కు ఒక మనిషికి రూ. 1,500–2,000 చార్జీ అవుతుండగా, దీనికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువగా రూ. 2,000–3,000 వరకు ఎయిర్‌ ట్యాక్సీ చార్జీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఏమని పిలవాలి?
విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీని సాంకేతికంగా ‘ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌’  (ఇ.వి.టి.ఓ.ఎల్‌.) ఎయిర్‌క్రాఫ్ట్‌ అంటున్నారు. మొత్తంగా ఈ రవాణా వ్యవస్థని ‘అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్‌)’ అంటారు.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

పనిచేస్తున్న 2 సంస్థలు
డీజీసీఏ రికార్డుల ప్రకారం ప్రస్తుత దేశంలో పౌర విమానయాన రంగంలో ఎయిర్‌ ట్యాక్సీల తయారీకోసం 2 సంస్థలు పనిచేస్తున్నాయని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. 

అవి చెన్నైకి చెందిన ‘యుబిఫ్లై టెక్నాలజీస్‌’ లేదా ఈ–ప్లేన్‌ కంపెనీ. ఐఐటీ మద్రాసులో ప్రాణం పోసుకున్న ఈ కంపెనీ ఎయిర్‌ ట్యాక్సీ, కార్గో ట్యాక్సీల తయారీలో పనిచేస్తోంది.

చండీగఢ్‌కి చెందిన ‘నల్వా ఏరో’. ఇది కనీసం ఐదుగురు ప్రయాణించగలిగే ఎయిర్‌ ట్యాక్సీ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.

ఎన్నో ప్రయోజనాలు
» వెర్టిపోర్టులన్నీ సౌర, పవన విద్యుత్‌వంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో నడిచేలా చూడాలన్నది కేంద్రం ఆలోచన. అలాగే, ఇవి పూర్తిగా గ్రీన్‌ పోర్టులుగా పర్యావరణ హితంగా ఉండాలని యోచిస్తోంది. విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
» రోడ్లమీద ట్రాఫిక్‌ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు
» కాలుష్య కారక ఉద్గారాలను విడుదల చేయవు. శబ్ద కాలుష్యమూ ఉండదు.
»ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు సరకు రవాణా, ఎమర్జెన్సీ సేవలకూ పనికొస్తుంది
» అత్యాధునిక సాంకేతికత, ప్రమాణాలతో పనిచేస్తాయి కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ
» సరికొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి
» మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ట్యాక్సీ సేవలను అందించవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement