ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని.. గత వారం కంటే ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. డీల్ కుదరకపోతే హర్మూజ్ను ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. హర్ముజ్ను క్లోజ్ చేస్తే మీకు దేశం లేకుండా చేస్తామన్న ట్రంప్.. హిజ్బొల్లాను అదుపు చేయకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామన్నారు.
లెబనాన్లో సమస్యలు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ వెంటనే నియంత్రించాలని తన 'ట్రూత్ సోషల్' పోస్ట్లో రాసుకొచ్చారు. 60 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే హర్మూజ్లో టోల్స్ వసూలు చేస్తామన్నారు. మరో వైపు, పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల కుదిరిన చారిత్రాత్మక ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ఆధారంగా ఈ ఉన్నత స్థాయి దౌత్య సమావేశం జరుగుతోంది. కతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, స్విస్ దౌత్యవేత్తలు ఈ వేదిక సిద్ధం చేశారు. రాబోయే 60 రోజుల్లో సమగ్ర అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, ప్రాంతీయ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు.


