
చైనా గబ్బిలాల్లో హెచ్కేయూ5 వైరస్లు
ఇవీ మెర్స్–కోవ్ కుటుంబానికి చెందినవే..
మ్యుటేషన్కు గురైతే ప్రాణాంతకమే
గుర్తించిన అమెరికా పరిశోధకులు
ప్రస్తుతానికి మనుషులకు ముప్పు లేదని వెల్లడి
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
→ మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్కేయూ5 వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు.
→ హెచ్కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు.

→ సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు.
→ చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
→ హెచ్కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.