37 మంది కార్మికుల మృత్యువాత
అబూజా: రాకపోకలు సాగించడానికి కనీస ఏర్పాట్లులేని ఒక గనిలో చెమటోడ్చి కష్టపడుతున్న కార్మికులను విష వాయులు బలితీసుకుంది. నైజీరియాలోని ప్లేటియూ ప్రావిన్స్లోని వేస్ నగర శివారులోని గనిలో విష వాయువు వ్యాపించడంతో 37 మంది గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. లెడ్ ఆక్సైడ్ తర్వాత సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులను పీల్చడం వల్లే వీళ్లంతా చనిపోయి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బుధవారం రాత్రి వీళ్లంతా చనిపోగా ఉదయం డ్యూటీలో చేరేందుకు వచ్చిన తదుపరి షిఫ్ట్ కార్మికులు చూసి ఈ ఘోరాన్ని మైనింగ్ కంపెనీ సాలిడ్ యూనిటీ నైజీరియా లిమిటెడ్కు తెలియజేశారు.
నిరక్షరాస్యులైన కార్మికులకు విష వాయువుల సాధారణ లక్షణాలను గుర్తించే సామర్థ్యం, అవగాహన లేవని, దీంతో వాటిని పీలుస్తూ అలాగే పనిచేసి ఉంటారని నైజీరియా ఘన ఖనిజాల అభివృద్ధి శాఖ మంత్రి డేలే అలాకే వ్యాఖ్యానించారు. అయితే వెనువెంటనే ఘటనాస్థలికి ప్రభుత్వ బలగాలు చేరుకోలేదు. స్థానిక దోపిడీముఠాల ప్రాభల్యం అధికంగా ఉండటంతో అక్కడి దర్యాప్తు అధికారులు చేరుకోవడం చాలా ఆలస్యమైంది. గని సొరంగాల్లో సరైన వెంటిలేషన్ సదుపాయం లేదని కొనఊపిరితో బయటపడిన కొందరు కార్మికులు చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో గనిలో కార్యకలాపాలను ప్రభుత్వం స్తంభింపజేసింది.


