సీడ్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్
రాజేంద్రనగర్: సీడ్స్ కంపెనీ లైసెన్స్ పేరిట లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డీన్ గోవర్ధన్ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... సీడ్స్ కంపెనీ అనుమతి కోసం ఓ వ్యక్తి 2025 మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్లో అనుమతులను అందిస్తానని వర్సిటీ డీన్, అసోసియేట్ ప్రొఫెసర్ జి.గోవర్ధన్ ఆ వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. లక్ష రూపాయలు అందిస్తే అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పగా, ఆ వ్యక్తి 25 వేల రూపాయలను ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. అనుమతులు మంజూరైన అనంతరం గోవర్ధన్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం గోవర్ధన్ తన కార్యాలయంలో డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


