 
															ఫైళ్లు పంపండి.. పనులు చేసుకోండి!
ఏసీబీకి చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, సిటీబ్యూరో: ‘ఉదయం ఫైళ్లు పంపించండి. సాయంత్రం సైలెంట్గా వచ్చి ‘పనులు’ పూర్తి చేసుకోండి. కానీ ఆర్టీఏ ఆఫీస్లో మాత్రం మీ కద
లికలు కనిపించొద్దు’. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో ఓ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఇన్చార్జి ఆర్టీఓగా వ్యవహరిస్తున్న ఓ అధికారి దళారులకు ఇచ్చిన ఉపదేశం ఇది. ఏజెంట్లు, దళారుల కార్యకలాపాలకు, తమ అక్రమార్జనకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు సదరు అధికారి అమలు చేసిన సరికొత్త సందేశం ఇది. ఈ మేరకు ఆయన ఏకంగా తమ కార్యాలయం పరిధికి చెందిన ఏజెంట్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఉదయం అందజేసిన ఫైళ్లపై సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత పనులు పూర్తి చేసుకొని వెళ్లాలని సూచించారు. లెర్న్గింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఫిట్నెస్లు వంటి ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి పౌరసేవలు అందజేసే అధికారులు కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వ్యవహారం ఇది. సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పాటు ఇటీవల పలు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. దీంతో సదరు అధికారులు అప్రమత్తమై సరికొత్త పద్ధతిని అనుసరించడం గమనార్హం.
ఏజెంట్ల మధ్య ఘర్షణ...
ఒకవైపు పైకి ఏజెంట్లను అనుమతించకుండా కట్టడి విధిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఫైళ్లను తెప్పించుకొని పనులు చేసి పెడుతున్నారు. దీంతో అందరికీ అవకాశాలు లభించడం లేదని, ఆర్టీఏ సిబ్బందికి, ఎంవీఐలకు ‘టచ్’లో ఉండేవాళ్లకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోందని కొందరు దళారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. ‘ఇక్కడ కనీసం 70 నుంచి 80 మంది ఏజెంట్లు ఉన్నారు. అందరి దగ్గర నుంచి ఆర్టీఏ కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఫైళ్లు సేకరించి తీసుకెళ్తున్నారు. కానీ అందరికీ తగినవిధంగా ప్రాధాన్యం లభించడం లేదు’అని ఓ ఏజెంట్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘దరఖాస్తుదారుల నుంచి లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులకు కనీసం రూ.5000 వసూలు చేస్తే అందులో సగానికి పైగా అధికారులకే చెల్లించాల్సివస్తోందని, తమకు దక్కేది తక్కువేనని’ పేర్కొన్నాడు.
గీతలుంటే రూ.3000 అదనం..
కార్లు, తదితర రవాణా, వ్యక్తిగత వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణపై కొందరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వేధింపులకు పాల్పడుతున్నారని సికింద్రాబాద్ తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ ఆరోపించారు. అధికారుల డిమాండ్ మేరకు ప్రతి బండికి నిర్ణీత ధర ప్రకారం కమీషన్ చెల్లించినప్పటికి బండికి చిన్న సొట్ట కనిపించినా, గీత ఉన్నా రూ.2000 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు.
రెట్టింపు వసూళ్లు..
డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, చిరునామా మార్పులు, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, వాహనాల ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ వంటి వివిధ రకాల పౌరసేవలపై రవాణాశాఖ విధించిన ఫీజులకు సుమారు రెట్టింపు చొప్పున దరఖాస్తుదారుల నుంచి ఏజెంట్లు వసూలు చేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్సుల్లో మార్పులు, చేర్పులకు: రూ.2000
కొత్తగా లెర్నింగ్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్లకు: రూ.5000
వాహనాల రీ–రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్కు: రూ.3000.
దళారులకు ఆర్టీఏ అధికారుల సూచనలు
గతంలో సికింద్రాబాద్తో పాటు పలు చోట్ల ఏసీబీ సోదాలు
ఈ నేపథ్యంలో కొందరు అధికారుల సరికొత్త పంథా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
