
గో‘దారులు’ కాకుండా !
సాక్షి, సిటీబ్యూరో: వర్షం పడితే రహదారులపై వరద ముంచెత్తకుండా హైడ్రా నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఆర్యూబీలు, వంతెనలను పరిశీలించి ఎక్కడా నీరు నిలవకుండా జాగ్రత్త పడుతోంది. వంతెనలపైన కురిసిన వర్షం నీరు కిందకు వెళ్లేలా వాటికి ఉన్న రంధ్రాలను గుర్తించి, అడ్డంకులు తొలగిస్తోంది. కొండాపూర్లోని కొత్తగూడ వంతెన, హఫీజ్పేట్ వంతెనలపైన ఉన్న రంధ్రాలన్నీ తెరిచారు. అలాగే నగరంలోని అన్ని వంతెనలపైన నీరు నిలవకుండా చర్యలు తీసుకుంది. మదీన గూడ దగ్గర నాలా క్లీనింగ్ పనులు పూర్తి చేశారు. ఆర్యూబీల వద్ద సంపులు నిర్మించి ఆటోమేటిక్గా నీటిని తోడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవి కొన్ని చోట్ల పని చేయకపోవడం, సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో తలెత్తిన ఇబ్బందుల పరిష్కారంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం మెహిదీపట్నం, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పుడు హైడ్రా ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి..వరద నిలవకుండా చర్యలు తీసుకున్నాయి. అలాగే చింతల్, ఎల్బీనగర్ ఆర్యూబీలను కూడా హైడ్రా అధికారులు పరిశీలించారు. కాటేదాన్ అండర్ పాస్ (ఆర్యూబీ) వద్ద నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేశారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డీఎఫ్ఓ యజ్ఞనారాయణ తదితరులు క్షేత్రస్థాయిలో ఈ పనులను పరిశీలించారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్న హైడ్రా